By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 21, 2024, 7:05 AM IST
ఐదేళ్లుగా పట్టించుకోలేదు - సీఎం వస్తున్నారని హడావుడిగా రాత్రికి రాత్రే పనులు - Road Works in CM Jagan Bus Yatra
Road was Hurriedly Complete for CM Jagan Bus Yatra: గుంతలమయమైన ఆ రోడ్డును ఐదు సంవత్సరాలుగా స్థానిక ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోలేదు. ప్రజలు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తూ ఎన్నో ప్రమాదాలకు గురయ్యారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం మరమ్మతులు చేయలేదు. అలాంటి రోడ్డును 'మేమంతా సిద్ధం' కార్యక్రమం కోసం సీఎం జగన్ వస్తున్నారని ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పట్టించుకోకుండా రాత్రికి రాత్రే బాగు చేశారు. సీఎం జగన్ ఇవాళ విశాఖ నగరంలో యాత్ర కొనసాగించనున్నారు. అనకాపల్లి జిల్లా నుంచి విశాఖ చేరుకునే మార్గంలో వేపగుంట- పినగాడి రోడ్డు గతుకులమయంగా ఉంది.
ఇన్నాళ్లుగా ఈ రోడ్డును పట్టించుకోని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజు రాత్రికి రాత్రి హడావుడిగా బాగు చేయించడంపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ఈ ఐదేళ్లుగా రోడ్డు గురించి మర్చిపోయిన నేతలు ఇప్పుడు ఎందుకు వేస్తున్నారని ప్రజలు, వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు ఈ రోడ్డు వేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పుడు వేస్తున్న రోడ్డును తాము అడిగినప్పుడే వేసి ఉంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.