By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 9:49 AM IST
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర లోటులో పయనిస్తోంది: ప్రొఫెషనల్ ఫోరం
Professional Forum Members Fires on YCP Government: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర లోటులో పయనిస్తోందని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అరాచకం రాజ్యమేలుతుందన్న" అంశంపై విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాలు తీసుకొస్తున్న అప్పులు, సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతూ అభివృద్ధిని గాలికొదిలేశారని ఫోరం అధ్యక్షుడు మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై సగటున నాలుగున్నర లక్షల రూపాయలు అప్పు ఉందన్నారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఇలాగే కొనసాగితే రాష్ట్రం అదోగతి పాలవుతుందని మహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
పాలకులు గెలుపు రాజకీయాల కోసం అన్నట్టు విధానాలను రూపొందించి దేశంలోనే ఆర్థిక లోటు కలిగిన రాష్ట్రంగా నిలిపారని మండిపడ్డారు. అర్థశాస్త్ర మూల సిద్ధాంతం ప్రకారం వనరులతో సాంఘిక, ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాల బడ్జెట్ల రూపకల్పన ఉండాలని మహేశ్వరరావు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉంటే మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.