By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 1:27 PM IST
వృద్ధుల కాళ్లు కడిగి పింఛన్ అందజేసిన మంత్రి నిమ్మల రామానాయుడు - Ramanaidu Pension Distribution
Minister Nimmala Ramanaidu Pensions Distribution in West Godavari : రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పంపిణీ చేపట్టారు. గత మూడు నెలలకు పెంచిన రూ. 3 వేలు, జులై నెల పింఛన్ 4 వేలతో కలిపి మొత్తం వృద్ధులు, వితంతువులకు రూ. 7 వేలు, దివ్యాంగులకు పదిహేను వేల రూపాయల చొప్పున పెన్షన్ అందజేస్తున్నారు. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమగోదావరి జిల్లా అడవి పాలెం గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి అర్హులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. మంత్రి వినూత్నంగా వృద్ధుల కాళ్లు కడిగి మరీ పింఛన్ అందజేశారు. దివ్యాంగులు, వృద్ధుల ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంపుతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రెండు, మూడు ఎకరాలు పొలం ఇచ్చినట్లేనని ఆయన అన్నారు. నాడు అన్న మాట ప్రకారమే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడతల వారి పెంపు కాకుండా ఒకేసారి పెంచుతూ మానవత్వం చాటుకున్నారన్నారని హర్షం వ్యక్తం చేశారు.