యాక్షన్లోకి దిగిన మంత్రి నాదెండ్ల మనోహర్ - ఆకస్మిక తనిఖీలతో ఫుల్ బిజీ - Minister surprise inspection
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 19, 2024, 7:45 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2024/640-480-21748035-thumbnail-16x9-minister-nadendla-manohar-conducts-surprise-inspection-in-ntr-district.jpg)
Minister Nadendla Manohar Conducts Surprise Inspection in NTR District : ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా నియమితులైన నాదెండ్ల మనోహర్ అప్పుడే యాక్షన్లోకి దిగారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని పౌరసరఫరాల శాఖ ఎంఎల్ఎస్ పాయింట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పౌరసరఫరాలశాఖ ద్వారా పంపిణీ చేసే సరకులకు తూకం వేయించారు. అనంతరం అవి బరువు తక్కువగా ఉన్నట్లు గమనించారు. అలాగే ప్యాకింగ్ లోపాలను సైతం గుర్తించారు. అక్కడి సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వక్తం చేశారు. తరువాత సంబంధిత అధికారుల నుంచి వివరాలు ఆరా తీశారు. అనంతరం రైస్మిల్లుల్లోనూ తనిఖీలు నిర్వహించారు.
రేషన్ సరుకుల్లో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. సరఫరాలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. తూకాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించి సరఫరాదారులను హెచ్చరించారు. అలాగే ఇటీవల జరిపిన తనిఖీల్లో 24 చోట్ల అక్రమాలు జరిగినట్లు వెల్లడించారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన స్టాక్ పాయింట్లను పరిశీలించిన అనంతరం అందులో పంచదార, కందిపప్పు, పామాయిల్ ప్యాకెట్లలో 50-80 గ్రాముల వరకు తేడా ఉన్నట్లు మంత్రి తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 253 మండల లెవెల్ స్టాక్ పాయింట్లను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.