ఏవోబీలో మావోయిస్టుల భారీ డంప్- స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ - MAOIST DUMP
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 3:42 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-06-2024/640-480-21762256-thumbnail-16x9-maoist-huge-dump-busted.jpg)
Maoist Huge Dump Busted at AP Odisha Border: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ పట్టుబడింది. బుధవారం రాత్రి బోడిగెట్ట బీఎస్ఎఫ్ క్యాంపు నుంచి జవాన్లు కూంబింగ్కు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో మల్కన్గిరి జిల్లాలోని సీలేరు నది అవతల కలిమెల సమితి కుర్మానూర్ పంచాయతీ, దూలగండిలో అటవీ ప్రాతంలో మావోయిస్టుల భారీ డంప్ని గుర్తించారు. ఓ కొండకు ఉన్న భారీ రంధ్రాల్లో ఈ సామగ్రిని నిల్వచేసినట్లు జవాన్లు తెలిపారు. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోందని వెల్లడించారు.
ఈ డంప్లో ఎస్బీఎమ్ఎల్ తుపాకీలు మూడు, ఎలక్ట్రిక్ డిటోనేటర్స్ మూడు, జిలెటెన్ స్టిక్స్ -98, డైరక్షనల్ మైన్స్ రెండు, సోలార్ ప్లేట్తో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ ప్రాంతం మావోయిస్టులకు కంచుకోటగా ఉండేది. స్థావరాలు ఏర్పాటు చేసుకుని సభలు, సమావేశాలు నిర్వహించేవారు. ప్రస్తుతం బీఎస్ఎఫ్ జవాన్లు నిరంతరం గాలింపు చర్యలు నిర్వహిస్తుండటంతో మావోయిస్టుల అలజడి కాస్త తగ్గింది.