'జగన్ రోడ్ల కోసం బటన్ నొక్కడం మర్చిపోయారా?'- ఖాళీ పేట్లతో లారీ డ్రైవర్ల నిరసన
By ETV Bharat Andhra Pradesh Team
Published : 4 hours ago
Lorry Drivers Protest For Road Repairs in Manyam District : పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం నుంచి కొమరాడ, కూనేరు మీదుగా ఒడిశా వెళ్లే అంతరాష్ట్ర రహదారి బాగుచేయాలని కోరుతూ లారీ డ్రైవర్లు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రహదారిలోని గోతులు పూడ్చండి లేకపోతే మాకు పట్టెడన్నం పెట్టండి అంటూ ఖాళీ పేట్లు పట్టుకుని నినాదాలు చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో లారీ డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గత నాలుగు ఏళ్లుగా రోడ్ల పైన గోతులు పూడ్చడానికి టెండర్లు వేస్తున్నాం అని చెప్పడమే తప్ప టెండర్ లేదు నిధులు రావు అని డ్రైవర్లు అసహనం వ్యక్తం చేశారు. ఇది మూడు రాష్ట్రాలకు వెళ్లే రహదారి పరిస్థితి అని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నిటికీ బటన్ నొక్కి ఈ రహదారుల అభివృద్ధికి బటన్ నొక్కడం మానేశారా అంటూ ఆందోళనకారులు మండిపడ్డారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి రహదారిని బాగుచేయాలని వారు కోరారు.