పొలంలోకి దిగి వరి నాట్లు వేసిన మహిళా ఎస్సై - వీడియో వైరల్ - Lady SI Sirisha Farming Viral Video - LADY SI SIRISHA FARMING VIRAL VIDEO
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 14, 2024, 6:46 AM IST
Koduru Lady SI Sirisha Farming Video Viral : నిత్యం కేసులు, బందోబస్తు కార్యక్రమాలతో హడావుడిగా ఉండే ఓ మహిళా ఎస్సై పొలంలోకి దిగి వరినాట్లు వేశారు. కూలీలతో కలిసిపోయి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా కోడూరు ఎస్సైగా శిరీష విధులు నిర్వహిస్తున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ సాగునీటి కాలువలపై జరుగుతున్న పనులను పరిశీలించేందుకు వెళ్లారు. ఎమ్మెల్యేకు బందోబస్తుగా వెళ్లిన ఎస్సై శిరీష కోడూరు మండలం గొల్లపాలెం సమీపంలో పొలంలోకి దిగి నారు పీకి కట్టలు కట్టారు. తర్వాత మహిళలతో కలిసి వరినాట్లు వేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె రైతులే సమాజానికి వెన్నెముక అని అన్నారు. మనం తినే ఆహారాన్ని పండించడానికి రైతులు పడే కష్టాలు మరువలేనివన్నారు. తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించబట్టే తాను ఈ స్థాయికి వచ్చానని, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులంతా ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని ఎస్సై శిరీష ఆకాంక్షించారు. పొలంలోకి దిగి వరినాట్లు వేసిన మహిళా ఎస్సై వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.