By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 3:08 PM IST
గృహ ప్రవేశం చేయాలనుకున్నారు - అంతలోనే కూలిన జగనన్న ఇంటి పైకప్పు
Jagananna Houses Collapsed in Anantapur : జగనన్న కాలనీలో గుత్తేదారుగా అవతారమెత్తిన వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు లబ్దిదారులకు నిర్మిస్తున్న ఇళ్లు గృహప్రవేశానికి ముందే కూలిపోతున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్లాపురంలో జగనన్న కాలనీలో ఓ ఇంటి (House) పైకప్పు కూలిపోయింది. శుక్రవారం గృహప్రవేశం ఉండగా ముందుగానే కప్పు నేలమట్టం అయ్యింది. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇంటి నిర్మాణానికి రాయదుర్గం మున్సిపాలిటీ 30వ వార్డు కౌన్సిలర్ భర్త సత్యనారాయణ క్రాంటాక్టు తీసుకుని నాసిరకంగా నిర్మించారని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం మంజూరు చేసిన ఒక లక్షా 80 వేల రూపాయల బిల్లుకు అదనంగా మరో ఒక లక్షా 30 వేల రూపాయలు చెల్లించినట్లు లబ్దిదారు హేమజ్యోతి తెలిపారు. శుక్రవారం గృహప్రవేశం (House Warming Ceremony) చేయాలనుకునే లోపు ఇలా ఇంటిపై కప్పు కూలిపోయిందన్నారు. సొంతంటి కల నెరవేరిందన్న ఆశలు నెల రోజులు కాకుండానే నిర్మాణం నేల మట్టమైందని దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.