భద్రాద్రి ఆలయ అన్నదానసత్రంలోకి చేరిన వర్షపు నీరు - Heavy Rains Effect in Bhadrachalam
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jun 14, 2024, 8:27 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-06-2024/640-480-21713295-thumbnail-16x9-bhadrachalam.jpg)
Heavy Rains Effect in Bhadrachalam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పట్టణంలోని చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకు ఒరిగాయి. పలు చోట్ల రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. ఈక్రమంలోనే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పరిధిలోని అన్నదాన సత్రం వద్ద డ్రైనేజీపై చెట్టు విరిగిపడటంతో, వాటర్ నిలిచిపోయి అన్నదాన సత్రంలోనికి వర్షపు నీరు చేరింది. దీంతో సత్రం ఎదురుగా రహదారిపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
మరోవైపు వర్షపు నీరు ప్రవేశించడంతో సత్రం మొత్తం శుభ్రం చేయాల్సి ఉండగా, రేపటి నుంచి అన్నదానాన్ని ప్యాకెట్ల రూపంలో పంచుతామని ఆలయ అధికారులు తెలిపారు. బూర్గంపాడు మండలం సారపాకలో భారీ వృక్షం రహదారిపై పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బసప్ప క్యాంపునకు వెళ్లేదారిలో ఇళ్లలోనికి వర్షపు నీరు చేరాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు కొమ్మలు విరిగి రోడ్డుపై పడటంతో పంచాయతీ సిబ్బంది ఎక్కడికి అక్కడ చెట్ల కొమ్మలు తీసివేశారు. మరోవైపు భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సెట్టింగ్ ఈదురు గాలులకు కూలిపోయింది.