ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం - రేపు మంత్రుల బృందం భేటీ
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 11, 2024, 7:17 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2024/640-480-20724740-thumbnail-16x9-govt-discussions-with-employees-union.jpg)
Govt Discussions With Employees Union: ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. పెండింగ్లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో సోమవారం చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయం రెండో బ్లాక్లో సమావేశానికి హాజరు కావాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాలకు ఈ మేరకు పిలుపునిచ్చారు. పెండింగ్ సమస్యల పరిష్కారించాలని ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు, ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర మంత్రుల బృందం భేటీ కానుంది.
6 వేల 700 కోట్ల రూపాయల మేర ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలు పడిందని ఉద్యోగులు వివరిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారించాలని ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. నాలుగు డీఏలు, సరెండర్ లీవులు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాట తప్పారని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే అందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను పట్టించుకుని ఇచ్చిన హామీలను నేరవేర్చాలని నిరసనలు చేస్తున్నాయి.