By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 7, 2024, 5:50 PM IST
ఎక్కడైనా అల్లర్లు జరిగితే 144 సెక్షన్ను పొడిగిస్తాం: పల్నాడు కలెక్టర్ - SP Malika Garg warned Palnadu people
Collector and SP Warned the People of Palnadu District : ఎన్నికల ఫలితాల అనంతరం ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే 144 సెక్షన్ కొనసాగిస్తామని పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లత్కర్ హెచ్చరించారు. శాంతి భద్రత పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై కలెక్టరేట్లో ఎస్పీ మలిక గర్గ్తో సమావేశం అయ్యారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్నారు. జిల్లాలో 86.5 శాతం ప్రజలు ఓట్లు వేశారని వివరించారు. 13,739 మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారని తెలిపారు. 2,136 మంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారని వివరించారు. అలాగే గురువారం సాయంత్రంతో ఎన్నికల కోడ్ ముగిసిందని మలిక గర్గ్ వెల్లడించారు.
అదేవిధంగా జిల్లాలో 28 రోజులు నిర్వహించిన 144 సెక్షన్కు సహకరించిన ప్రజలకు, దుకాణదారులకు కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ భవనాలపై రంగులు మార్చడం, విగ్రహాలు తొలగించడం లాంటివి పర్మిషన్ తీసుకుని మాత్రమే చేయాని సూచించారు. పలు సమస్యాత్మక గ్రామాల్లో పెట్రోలింగ్ చేస్తూ, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. దీనిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో కౌంటింగ్ ప్రశాంతంగా జరిగినందుకు ఎలక్షన్ కమిషనర్ అభినందించారని పల్నాడు జిల్లా ఎస్పీ మలిక గర్గ్ వెల్లడించారు.