వాడీవేడిగా తిరువూరు పురపాలక సమావేశం - ఛైర్పర్సన్ను నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు - Tiruvuru Municipal Council meeting
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 29, 2024, 3:55 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-06-2024/640-480-21825690-thumbnail-16x9-fight-between-tdp-and-ycp-leaders-in-tiruvuru-municipal-council-meeting.jpg)
Clash Between TDP and YCP Leaders in Tiruvuru Municipal Council Meeting : ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పురపాలక సంఘం సమావేశం వాడీవేడిగా జరిగింది. పట్టణంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించిన తెలుగుదేశం సభ్యులపై వైఎస్సార్సీపీ సభ్యులు ఎదురు దాడికి దిగారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును సమావేశానికి ఆహ్వానించకపోవడంపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన టీడీపీ సభ్యులపై వైఎస్సార్సీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. అనంతరం పరస్పర ఆరోపణలతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది.
అలాగే పట్టణంలో నెలకొన్న సమస్యలపై స్వపక్షానికి చెందిన వైఎస్సార్సీపీ సభ్యులే ఛైర్పర్సన్ను నిలదీశారు. దీనిపై మరికొంత మంది వైసీపీ సభ్యులు సమాధానం చెప్పే ప్రయత్నం చేయగా వారిపై సొంత పార్టీ సభ్యులే ఎదురుదాడికి దిగడం వల్ల సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సొంత సభ్యులే దురుసుగా ప్రవర్తించడంతో మనస్తాపంతో వైసీపీ సభ్యులు పద్మ, నీలిమ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపొయారు. అనంతరం అజెండాలో చేర్చిన అంశాలపై సభ్యులు చర్చించారు. ప్రధానంగా మున్సిపల్ శాఖలో నెలకొన్న సమస్యలపై సభ్యులు ప్రస్తవించారు. కొన్ని అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.