By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 10:45 AM IST
రైల్వే కూలీలపై చిరుతపులి దాడి- మహిళకు తీవ్ర గాయాలు - Cheeta attack women
Cheeta attack on railway workers in Nandyala District : నంద్యాల జిల్లా మహానంది మండలం నల్లమల అటవీ ప్రాంతంలో రైల్వే పనులు చేస్తున్న కూలీలపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటనలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పాండవ్ తీవ్రంగా గాయపడింది. అడవిలోని చలమ రైల్వే స్టేషన్ పరిధిలో పనులు చేస్తుండగా చిరుత హఠాత్తుగా మహిళపైకి దూకి గాయపర్చింది. ఆమె తల, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే రైల్వే పనులు చేస్తున్న మహిళ కుటుంబీకులు తోటి కూలీలు గట్టిగా కేకలు వేస్తూ ఇనుప వస్తువులు, కర్రలు తీసుకుని వెళ్లగా చిరుత మహిళను వదిలి అడవిలోకి పారిపోయింది.
చిరుతదాడిలో గాయపడిన మహిళను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ఛత్తీస్గఢ్ కు చెందిన సుమారు 20 మంది కూలీలు గాజులపల్లె వద్ద రైల్వే పనులు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన చిరుత దాడి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పాండవ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.