By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 9:58 AM IST
నడి సంద్రంలో బోటు దగ్ధం - ప్రాణాలతో బయటపడ్డ మత్స్యకారులు
Caught Fire From a Fisherman Boat : సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నడి సముద్రంలోకి వెళ్లిన కాసేపటికే పడవ ఇంజన్ పేలి మత్స్యకారుల బోటు దగ్ధమైంది. ఈ ఘటన కాకినాడ జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సముద్ర తీరంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు చోటుచేసుకుంది. ఉప్పాడకు చెందిన 11 మంది మత్స్యకారులు సోమవారం ఉదయం సముద్రంలోకి వేటకు వెళ్లారు. నడిసముద్రంలోకి వెళ్లాక సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా పడవ ఇంజన్ పేలిపోయింది. క్షణాల్లో పడవ మొత్తం మంటలు వ్యాపించడంతో మత్స్యకారులందరూ సముద్రంలోకి దూకారు. సమీపంలో ఉన్న మరో పడవలోకి వెళ్లి ప్రాణాలను కాపాడుకున్నారు.
Boat Fire in Uppada Sea : ఈ ప్రమాదంలో బోటు పూర్తిగా దగ్ధం అయ్యిందని, వలలు పూర్తిగా కాలిపోయాయని మత్స్యకారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే క్షేమంగా ఉన్నట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంలో సుమారు 25 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు మంగళవారం ఒడ్డుకు చేరుకునే అవకాశం ఉందని స్థానిక మత్స్యకారులు చెప్పారు.