Money Distribution at YS Jagan Bus Yatra Meeting: సీఎం సభ అంటేనే అవస్థలు, మందు బాబుల చిందులు వంటివి గత కొంతకాలంగా ప్రజలు చూస్తున్నారు. ఎన్నికల కోడ్ రాకముందు ప్రజలను బయపెట్టి మరీ వైసీపీ నేతలు ముఖ్యమంత్రి జగన్ (YS Jagan Mohan Reddy) సభలకు రప్పించేవారు. అయితే ఇవ్వన్నీ ఎన్నికల కోడ్ రాకముందు. ఎప్పుడు అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ మొదలైందో అప్పటి నుంచి ప్రజలు వైసీపీ సభలు అంటేనే ముఖం చాటేస్తున్నారు. దీంతో ఎలాగైనా సరే ప్రజలను రప్పించుకునేందుకు ప్రజలకు డబ్బులను పంచడం మొదలు పెట్టేశారు. తాజాగా బహిరంగంగానే సీఎం సభకు వచ్చిన మహిళలకు డబ్బులు పంచుతూ వైసీపీ నేతలు వీడియోకు చిక్కారు. ఈ దృశ్యాలు స్థానికంగా వైరల్ గా మారాయి.
బహిరంగంగానే డబ్బుల పంపిణీ: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభకు వచ్చే మహిళలకు వైసీపీ నాయకులు కవర్లో పెట్టి డబ్బులు పంపిణీ చేశారు. బహిరంగ సభకు జనసమీకరణ కోసం మహిళలకు పట్టణంలో డబ్బులు ఇచ్చి బహిరంగ సభకు తరలించినట్లు సభకు వచ్చిన వారు చెబుతున్నారు. సీఎం సభ కోసం వచ్చిన మహిళలను వైసీపీ నాయకులు ఓ చోటికి చేర్చారు. డబ్బులు ఉంచిన కవర్లను మహిళలకు పంచారు. అయితే, కవర్లో ఒక్కొక్కరికి ఒక్కోరకంగా డబ్బులు పంచినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు.
జగన్ బస్సు యాత్రకు జనం కరవు - ప్రారంభం రోజే అట్టర్ప్లాప్ - CM Jagan Bus Tour Fail
బస్సులు లేక ప్రయాణీకుల అవస్థలు: మరోవైపు ఎమ్మిగనూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆర్టీసీ బస్సులు తరలించడంతో బస్సులు లేక ప్రయాణీకులు అవస్థలు పడ్డారు. బస్సులన్నీ బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు తీసుకెళ్లడంతో ప్రయాణీకులు బస్టాండ్లో గంటల తరబడి నిరీక్షించారు. చాలా మంది ఆటోలను ఆశ్రయించి గమ్యస్థానాలకు వెళ్లారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 'మేమంతా సిద్ధం' (Memantha Siddham) సభ నేపథ్యంలో సమతా సైనిక్ దళ్ నాయకులను అరెస్టు చేశారు. సమతా సైనిక్ దళ్ రాయలసీమ నాయకుడు రంగయ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడ జరిగిందో ప్రశ్నించేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. దళితులు నష్టపోయిన పథకాలపై అడిగేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంతో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు సమతా సైనిక్ దళ్ నాయకులను అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు.
ఎలా మాట్లాడాలో ముందే శిక్షణ - భజనలా ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి - CM Jagan sabha in erraguntla
కోడుమూరులో అరకొర స్పందన: బస్సులు పెట్టినా, డబ్బులు పంచినా జగన్ సభలు జనం మాత్రం రావడం లేదు. తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు ప్రజల నుంచి ఆశించిన స్పందన లేదు. బస్సులు పెట్టి మరీ జనాలను తరలించినా అరకొరగానే జగన్ యాత్రకు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి జగన్కు నిరసన సెగ: మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన ముఖ్యమంత్రి జగన్కు కర్నూలు జిల్లాలో నిరసన సెగ తగిలింది. కోడుమూరు మండలం రామచంద్రాపురం వాసులు బిందెలతో నిరసన తెలిపారు. ఎమ్మిగనూరు బహిరంగ సభకు వెళుతుండగా మార్గమధ్యంలో స్థానిక ప్రజలు బిందెలతో అడ్డుకున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో కిందికి దిగి వచ్చిన సీఎం సమస్యను విన్నారు.
కర్నూలు జిల్లాలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా వామపక్షాల నాయకులు సైతం నిరసన తెలిపారు. కోడుమూరులో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయిదు సంవత్సరాలలో జగన్ చేసింది ఏమీ లేదని, కనీసం తాగునీటి సమస్యను సైతం పరిష్కరించలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా పట్టణానికి తాగునీరు ఇవ్వాలని కోరారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.