Two More National Highways to Amaravathi : రాజధాని అమరావతిని జాతీయ రహదారితో అనుసంధానం చేసేందుకు సీడ్ యాక్సిస్ రోడ్ తరహాలో మరో రెండు రోడ్లను అభివృద్ధి చేసేలా సీఆర్డీయే ప్రణాళికలు చేస్తోంది.ప్రస్తుతం ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు తో పాటు రాజధానిలోని ఇ-11, ఇ-13 రోడ్లను కూడా 16 వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా కసరత్తు మొదలు పెట్టింది.
రాజధాని అమరావతిని చెన్నై - కోల్కతా జాతీయ రహదారితో (NH-16) అనుసంధానిస్తూ మొత్తం మూడు రోడ్లు అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) ఆలోచిస్తోంది. గతంలో రూపొందించిన రాజధాని ప్రధాన మౌలిక వసతుల ప్రణాళిక (Capital Major Infrastructure Plan) ప్రకారం ఒక్క సీడ్ యాక్సెస్ రోడ్డును (E-3) మాత్రమే మణిపాల్ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారితో కలపాలనుకున్నారు. ఇప్పుడు దాంతోపాటు ఇ-11, ఇ-13 రహదారులను కూడా ఎన్హెచ్-16తో( National Highway) అనుసంధానించనున్నారు.
రాజధానిలో ప్రధాన రహదారుల ప్రణాళికను తూర్పు నుంచి పడమరకు( East to West), ఉత్తరం నుంచి దక్షిణానికి( north to south) గ్రీడ్ విధానంలో (Grid System) రూపొందించారు. తూర్పు నుంచి పడమరకు వెళ్లే రహదారులు ఇ-1 నుంచి ఇ-16(E-1 to E-16) వరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే మార్గాలు ఎన్-1 నుంచి ఎన్-18( E-1 to E-18) వరకు ఉన్నాయి. వాటిలో సీడ్ యాక్సెస్ రోడ్డు(Seed Access Road)కు ఇ-3 నంబరు కేటాయించారు.
రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ముందుగా నిర్మాణాలు చేపట్టారు. దాన్ని మొత్తం 21.278 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని అనుకున్నారు. దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు (Dondapadu to Prakasam barrage) 18.270 కిలో మీటర్లు ఒక ప్యాకేజీగా, బ్యారేజీ నుంచి మణిపాల్ ఆస్పత్రి వరకు 3.08 కిలో మీటర్లు రెండో ప్యాకేజీగా నిర్మించాలని తలపెట్టారు. మొదటి ప్యాకేజీ పనులు దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు 14 కి.మీ మేర పూర్తి అయ్యాయి.గత ఏడు సంవత్సరాలుగా రాజధానికి ఈ మార్గంలోనే రాకపోకలు సాగుతున్నాయి.
పట్టాలెక్కుతున్న పురోగతి- ఎన్డీయే ప్రభుత్వంతో రహదారులకు మోక్షం - Widening of National Highway 44
వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజధానిపై కక్షగట్టి పనులు నిలిపివేయడంతో సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు, అక్కడి నుంచి మణిపాల్ ఆస్పత్రి వరకు రోడ్డు నిర్మాణానికి భూసేకరణ సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇ-3 (E-3)తోపాటు ఇప్పుడు ఇ-11, ఇ-13 రహదారులను కూడా హైవేతో అనుసంధానించాలన్న ప్రతిపాదనను సీఆర్డీఏ (CRDA) తెరపైకి తెచ్చింది.
ఇప్పటికే ఎన్హెచ్-16 (NH-16) నుంచి మంగళగిరి ఎయిమ్స్కు కొండల పక్క నుంచి ఒక రహదారి నిర్మించారు. అదే తరహాలో ఇ-11, ఇ-13 మార్గాలను కొండ అంచు నుంచి తీసుకెళ్లి హైవేతో కలపాలని సీఆర్డీఏ CRDA యోచిస్తోంది. వీటికి భూసేకరణ సమస్యల్లేవు. కాబట్టి, త్వరగా పూర్తి చేయగలమని సీఆర్డీఏ భావిస్తోంది.
ఇ-11 రహదారిని నీరుకొండ నుంచి నవులూరు వరకు 6.3 కిలోమీటర్లు మేర నిర్మించాలని ఆలోచిస్తోంది. దాన్ని మరో 4.50 కిలోమీటర్లు పొడిగించి హైవేతో కలపనున్నారు. ఈ రోడ్డు నిర్మాణం 2019కి ముందే మొదలై 42% పూర్తయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ నిర్మాణం కొంత దెబ్బతింది. అప్పటి ప్రణాళిక ప్రకారం ఇ-13 రహదారి పొడవు 7.31 కిలోమీటర్లు కాగా, దాన్ని మరో 2.2 కిలోమీటర్లు పొడిగించలని అనున్నారు.
అది నీరుకొండకు దిగువన మొదలవుతుంది. రాజధానిలోని ఎస్ఆర్ఎం(SRM), అమృత యూనివర్సిటీలు (Amrita University) ఈ రెండు రహదారుల మధ్యలోనే ఉన్నాయి. మంగళగిరి ఎయిమ్స్ కోసం అభివృద్ధి చేసిన రోడ్ల తరహాలోనే కొండ అంచు నుంచి రోడ్లు నిర్మించేలా ప్రణాళికను సీఆర్డీఏ(CRDA) అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రహదారిని అనుసంధానం చేసేందుకు భూ సేకరణ చేసేందుకు చంద్రన్న సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. స్థానికంగా ఉండవల్లి ప్రాంతంలో భూ సేకరణకు అడ్డంకులు ఏర్పడటంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలను ప్రారంభించినట్లు సమాచారం.
హైదరాబాద్-బెంగళూరు హైవే విస్తరణ - రాయలసీమకు మహర్దశ - Hyderabad Bangalore Highway