SIT TEAM TO TIRUMALA: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీమ్ దర్యాప్తులో వేగం పెంచింది. సిట్ అధికారులు తిరుపతి చేరుకున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై విచారణ చేస్తున్నారు. కల్తీ నెయ్యి ఘటనలో విచారణ కోసం ప్రభుత్వం 9 మందితో సిట్ను ఏర్పాటు చేసింది.
తాజాగా నేడు సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు ఇతర సభ్యులు తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహనికి సిట్ అధిపతి, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చేరుకున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలలో వినియోగించే నెయ్యి కల్తీపై దర్యాప్తు నిమిత్తం తిరుపతికి వచ్చిన ఆయన కాసేపు విశ్రాంతి తీసుకోని అనంతరం తిరుమలకు బయలుదేరి వెళ్లారు.
తిరుమల శ్రీవారి దర్శన అనంతరం తిరుమలలో లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలను పరిశీలించనున్నారు. మూడు రోజుల పాటు సిట్ బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించనుంది. ప్రత్యేక దర్యాప్తు బృందానికి కార్యాలయాన్ని టీటీడీ ఏర్పాటు చేయనుంది. అదే విధంగా సిట్ అధికారులు టీటీడీ ఈవో శ్యామలరావుతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణకు సిట్ - 9 సభ్యులతో టీమ్ ఏర్పాటు - SIT on Tirumala Laddu Adulteration