People Suffer From Heavy Rains Effect in Eluru District : రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏలూరు జిల్లా చిగురుటాకుల వణికింది. నూజివీడులోని పెద్ద చెరువుకు గండిపడి కలపర్రు టోల్ గేట్ సమీపంలోని జాతీయ రహదారిపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. హనుమాన్ జంక్షన్ నుంచి కలపర్రు టోల్ గేట్ వరకు వరద నీరు నిలవడంతో విజయవాడ నుంచి ఏలూరుకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలను ఏలూరు శివారు వద్ద పోలీసులు నిలిపేశారు. వాహనాలు భారీగా బారులు తీరడంతో హనుమాన్ జంక్షన్ ను కాసేపు మూసివేశారు అధికారులు. అనంతరం యుద్దప్రాతిపధికన వరద నీరును తొలగించే చర్యలను చేపట్టిన పోలీసులు, హైవేపై డివైడర్ను తొలగించి రహదారిపై నిలిచిన వరద నీటిని మళ్లించారు. దీంతో ఏలూరు, విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు మార్గం సుగమం అయ్యింది.
Rains Update in Eluru District: నూజివీడులో భారీ వర్షానికి పెద్ద చెరువుకు గండి పడటంతో ఆ వరదంతా సమీపంలోని కాలనీలను ముంచెత్తింది. నూజివీడులో పర్యటించిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సహాయ చర్యలను పర్యవేక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని జేసీబీ సాయంతో బయటికి తీసుకువచ్చి పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. పెద్దచెరువు వరద ప్రవాహం రామిలేరు, తమ్మిలేరుకు పోటెత్తింది.
సహయక చర్యలు చేపట్టిన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది: పెదపాడు మండలం అప్పనవీడు, తాళ్లమూడి గ్రామాలను నీరు చుట్టుముట్టింది. ఆ ప్రాంతంలో పర్యటించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కాలనీల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో అప్పనవీడు సచివాలయంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఏ ఇబ్బంది వచ్చినా తనకు చెప్పాలని ఎమ్మెల్యే సూచించారు. ముదినేపల్లి మండలం చెక్కపల్లి వైపు వెళ్లే రోడ్డు తెగిపోవడంతో చిగురుకోటలో పంటపొలాలు నీట మునిగాయి. పెదపాడు మండలం కలపర్రు వద్ద జాతీయ రహదారిపైకి వరద చేరికతో టోల్ గేటుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై నీటిని పొలాల్లోకి పంపే ఏర్పాటు చేసిన అధికారులు ట్రాఫిక్ను పునరుద్దరించారు.
పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుంచి నీరు విడుదల: పశ్చిమ ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద క్రమేపి గోదావరి ఉద్ధృతి పెరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా గోదావరి వరద నీరు చేరుతోంది. స్పిల్వే ఎగువన 30 మీటర్లు, దిగువన 20 మీటర్లు నీటి మట్టం చేరింది. 48 రేడియల్ గేట్ల ద్వారా 5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.
వర్షానికి నూజివీడులో మునిగిన ఇళ్లు: నూజివీడులో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ధాటికి పలు చోట్ల ప్రజలు నిరాశ్రయులయ్యారు. శనివారం రాత్రి పునరావాస కేంద్రాల్లో సేదతీరి ఉదయం ఇళ్ల వద్దకు వచ్చి చూసేసరికి ఇళ్ల మధ్యలో పెద్దఎత్తున వరదనీరు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలో వస్తువులన్నీ చెల్లా చెదురయ్యాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. పట్టణంలోని కొప్పుల వెలమపేట కనకదుర్గమ్మ ఆలయం వద్ద వరద ఉద్ధృతి తగ్గడంలేదు. నూజివీడు నుంచి విస్సన్నపేట, ముసునూరు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
నూజివీడులో వర్ష బీభత్సం- సర్వం కోల్పోయామంటున్న స్థానికులు - Flood Effect in Eluru
రికార్ఢు వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా అతలాకుతలం - Heavy Rains in Krishna District