NDA Alliance Get 18 Seats in AP: సిద్ధం సిద్ధం అంటున్న సీఎం జగన్ మార్పునకు సిద్దపడాలని ఒపీనియన్ పోల్స్, సర్వేలు సూచిస్తున్నాయి. ప్రజలు సైతం వైఎస్సార్సీపీని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే గ్రామస్థాయిలో వైఎస్సార్సీపీ ఓటమిపై ఓ స్పష్టమైన అంచనాకు వచ్చిన వైఎస్సార్సీపీ పెద్దలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుండగా, తాజాగా ఏబీపీ దేశం, సీ-ఓటర్స్, న్యూస్18-సీఎన్ఎన్ నిర్వహించిన సర్వేల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటమి రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని తెలిపాయి.
ఎన్డీయే కూటమికి 18 సీట్లు: న్యూస్ 18-సీఎన్ఎన్ మెగా ఒపీనియన్ పోల్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏపీలో ఎన్డీయే కూటమికి మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. మెుత్తం ఏపీలో మొత్తం 25 స్థానాలు ఉండగా, అందులో ఎన్డీయే కూటమికి 18 సీట్లు వస్తాయని మెగా ఒపీనియన్ పోల్ వెల్లడించింది. వైఎస్సార్సీపీకి కేవలం ఏడు స్థానాలు మాత్రమే వస్తాయని వెల్లడించింది. ఓట్ల షేర్ విషయానికొస్తే, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సుమారు 50 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని మెగా ఒపీనియన్ పోల్ తెలిపింది. వైఎస్సార్సీపీకి 44 శాతం మంది మొగ్గు చూపినట్లు వెల్లడించింది. ఇతరులకు కేవలం 3 శాతం ఓట్లు లభిస్తాయని మెగా ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేసింది.
సీ-ఓటర్ సర్వే: దేశ వ్యాప్తంగా సర్వే చేపట్టిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 20 లోక్సభ స్థానాలు టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కూటమి 20 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 స్థానాలకే పరిమితమయ్యే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రకటించిన జాతీయ సర్వేల ఫలితాలన్నీ టీడీపీకే పట్టం కట్టడం విశేషం. ఫిబ్రవరి చివర, మార్చి మొదటి వారంలో ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. మొత్తం 41,762 మంది అభిప్రాయాలను ఆన్లైన్ (CATI) ద్వారా నమోదు చేసింది. వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి టీడీపీ హవా కొనసాగుతుందని వెల్లడించింది. తాము వెల్లడించిన ఫలితాలు 95 శాతం కచ్చితత్వం సాధిస్తాయని సర్వే సంస్థ ధీమా వ్యక్తం చేసింది.
ఈ సర్వేలో ప్రజాభిప్రాయం ప్రకారం ఏపీలో టీడీపీ బలంగా NDA 45 శాతం ఓట్లను సాధిస్తుందనేది అంచనా. ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42 శాతం ఓటింగ్ దక్కించుకుని ద్వితీయ స్థానంలో ఉంటుందని తెలుస్తోంది. INDIA కూటమికి 3% ఓట్లు రావచ్చని సర్వే అంచనా వేసింది.
మరో జాతీయ సర్వేలోనూ టీడీపీకే పట్టం - తెలంగాణలో కాంగ్రెస్కు ఆధిక్యం
జగన్ గ్యాంగ్ తప్పించుకోలేదు : టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిదే గెలుపని సర్వేలు చెబుతున్నాయని నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇండియాటుడే, ఏబీపీ, సీ-ఓటర్స్ న్యూస్18 సర్వేలు కూటమిదే గెలుపని తేల్చేశాయని పేర్కొన్నారు. సైకో జగన్ చేతిలో రాష్ట్రం ధ్వంసమైందని, కూటమితోనే ఏపీ పునర్మిర్మాణం సాధ్యమన్నది జనం నమ్ముతున్నారని తెలిపారు. కూటమిపై ప్రజల నమ్మకాన్ని జాతీయ మీడియా సర్వేలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేనదే విజయమని గతంలోనే ఇండియాటుడే చెప్పిందన్నారు. ఏపీలో 20 స్థానాల్లో ఎన్డీఏదే విజయమని ఏబీపీ సర్వే చెప్పగా, 18 స్థానాల్లో ఎన్డీఏదే గెలుపని న్యూస్18 సర్వే చెప్పిందని లోకేశ్ వెల్లడించారు. దారుణ పరాజయం నుంచి జగన్ గ్యాంగ్ తప్పించుకోలేదని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక తుపానులో వైఎస్సార్సీపీకి అంతిమయాత్ర ఖాయమని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
ఫిబ్రవరి 12 నుంచి మార్చి 1 తేదీ వరకు: న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ పేరిట ఆ సంస్థ దేశవ్యాప్తంగా సర్వే చేపట్టింది. 2024 ఫిబ్రవరి 12 నుంచి మార్చి 1వ తేదీవరకూ దేశవ్యాప్తంగా 1లక్షా 18వేల 616 మంది ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు. ఏపీలో పలువురి అభిప్రాయాల్ని తీసుకున్న అనంతరం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేసి, ఆ వివరాలను వెల్లడించారు.
అంతా 'మోదీ'మయమే.. తగ్గని ప్రజాదరణ.. ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠంపై!