Governor Appointing New Vice Chancellors For Several Universities in AP : ప్రతిభకు ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమించింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకల వర్గానికి చెందిన మహిళ ప్రసన్నశ్రీని రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ వర్సిటీ వీసీగా ఎంపిక చేసింది. భర్తీలో పైరవీలు, సిఫారసులకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా ప్రతిభావంతులకే అవకాశమిచ్చింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. గతంలో రాజకీయ నేపథ్యం, సిఫారసులున్న వారే ఎక్కువగా వీసీలుగా ఎంపికయ్యేవారు. ఈసారి ఎలాంటి రాజకీయ వాసనలు లేకుండా సమర్థులైన విద్యారంగ నిపుణులను గుర్తించి ప్రభుత్వం సముచిత ప్రాధాన్యమిచ్చింది.
విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల ఎంపిక కోసం దాదాపు ఆరు నెలలపాటు మంత్రి నారా లోకేశ్ కసరత్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 17 వర్సిటీల వీసీలు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఈ స్థానాల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. అన్నింటికి కలిపి 2వేల దరఖాస్తులు రాగా, 512 మందికిపైగా అభ్యర్థులు పోటీ పడ్డారు. వీటన్నింటిని వడపోసి మొదటి విడతగా తొమ్మిది వీసీ పోస్టులను భర్తీ చేస్తూ మంగళవారం ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. కొత్తగా నియమితులైన వీసీలలో నలుగురు ఇంజినీరింగ్, ముగ్గురు సైన్స్, ఇద్దరు సోషల్ సైన్స్ విభాగాల్లో ఆచార్యులు, నిపుణులు ఉన్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే నలుగురు ఓసీలు, ముగ్గురు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
ఆదికవి నన్నయ్య వర్సిటీ: అంతరిస్తున్న గిరిజన భాషలను కాపాడేందుకు ఆదికవి నన్నయ వర్సిటీ వీసీగా నియమితురాలైన ప్రసన్నశ్రీ కృషి చేశారు. గిరిజనుల్లోని భగత, గదబ, కొలామి తదితర తెగల భాషలకు ఆమె లిపి రూపొందించారు. ఈ లిపులకు గూగుల్ సైతం వెబ్సైట్లో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. అంతరిస్తున్న భాషల అట్లాస్ను రూపొందించిన భారతీయురాలిగా ఎన్డీజడ్ ఆల్ఫాబెట్ అట్లాస్ తయారుచేసి ఆమె గుర్తింపు పొందారు. ఎస్టీ ఎరుకల వర్గానికి చెందిన ఈ నిత్య పరిశోధకురాలికి వీసీ పదవి లభించింది. ఆదికవి నన్నయ వీసీ ప్రసన్నశ్రీ స్వస్థలం విజయవాడ సీతానగరం, సర్దార్ పటేల్ మహావిద్యాలయలో పీహెచ్డీ చేసారు. 37 ఏళ్లకుపైగా బోధన అనుభవం కలిగి వున్నారు. ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో ఆంగ్ల విభాగాధిపతిగా పని చేసారు. ఇప్పటివరకు 40కిపైగా అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. 2021లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి నారీశక్తి పురస్కారం అందుకున్నారు. 125 పరిశోధన వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
ఆంధ్ర విశ్వవిద్యాలయం: త్వరలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఐఐటీ ఖరగ్పూర్ గణితం ఆచార్యులు, ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ నియమితులయ్యారు. బీపీ రాజశేఖర్ స్వస్థలం విశాఖపట్నం సింహాచలం. హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీలో పీహెచ్డీ, ఏయూలో ఎమ్మెస్సీ చేసారు. ప్రొఫెసర్గా 27 ఏళ్లు అనుభవం ఉంది. ఐఐటీ ఖరగ్పూర్లో 14 ఏళ్లు బోధన చేసారు. 16కుపైగా అవార్డులు అందుకున్నారు. అప్పట్లో రాష్ట్రపతి అబ్దుల్కలాం నుంచి ‘యంగ్ సైంటిస్ట్’, 2023లో వరంగల్ నిట్లో నేషనల్ మ్యాథమెటీషియన్ ఆఫ్ది ఇయర్ అవార్డు అందుకున్నారు. వివిధ అంతర్జాతీయ జర్నల్స్లో 112 పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి.
జేఎన్టీయూ కాకినాడ: ఉన్నత విద్యలో అమెరికా-ఇండియా భాగస్వామ్యంపై పని చేసిన అనుభవమున్న నిట్ వరంగల్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ను జేఎన్టీయూ కాకినాడ వీసీగా నియమించింది. జేఎన్టీయూ కాకినాడ వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ స్వస్థలం బాపట్ల. వరంగల్ నిట్ నుంచి ఎంటెక్, పీహెచ్డీ చేసారు. 17 ఏళ్లు ప్రొఫెసర్/సైంటిస్టు, అమెరికా-ఇండియా ఉన్నత విద్య సమన్వయం అనుభవం కలిగిన వున్నారు. 2012లో గవర్నర్ సిల్వర్ మెడల్. 2011లో డాడ్ ఫెలోషిప్ అవార్డులు అందుకున్నారు.
కృష్ణా వర్సిటీ: 23 ఏళ్లుగా ఏయూలో బోధన అనుభవం ఉన్న కూన రామ్జీని కృష్ణా వర్సిటీ వీసీగా నియమించారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం పొందూరు మండలం పెనుబరి. ఐఐటీ రూర్కీలో పీహెచ్డీ చేసారు. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ వీసీ, ఆచార్య నాగార్జున వర్సిటీ ఇన్ఛార్జి వీసీ సేవలందించారు. 300కుపైగా పరిశోధన పత్రాలు వివిధ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో నానో టెక్నాలజీపై పరిశోధన చేసారు.
విక్రమ సింహపురి: బోధనలో 13 ఏళ్లు అనుభవం ఉన్న అల్లం శ్రీనివాసరావును విక్రమ సింహపురి వీసీగా ఎంపిక చేశారు. ఆయన స్వస్థలం కర్నూలు. అయన శ్రీవేంకటేశ్వర వర్సిటీలో ఎమ్మెస్సీ, పీహెచ్డీ చేశారు. 2023, 2024లలో ఎర్లీ రీసెర్చ్ ఇంపాక్ట్, ఇంపాక్ట్ అవార్డులు పొందారు. శ్రీపద్మావతి మహిళ వర్సిటీ వీసీ వి. ఉమ, స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఆమె అభివృద్ధి పరిశోధనలో పీహెచ్డీ చేసారు. 23 ఏళ్లు ప్రొఫెసర్గా అనుభవం కలిగి వున్నారు. 1989లో కామన్వెల్త్ అకడమిక్ స్టాఫ్ స్కాలర్షిప్, 2022లో విద్యలో విశిష్ట సేవ అవార్డు పొందారు.
జేఎన్టీయూ అనంతపురం: 39 ఏళ్లుగా బోధన చేస్తున్న సుదర్శనరావును జేఎన్టీయూ అనంతపురం వీసీగా నియమించారు. ఆయన స్వస్థలం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ. అయన విద్యార్హతలు ఐఐటీ బాంబేలో పీహెచ్డీ చేసారు. నిర్మాణ రంగంలో ఉపయోగించే కాంక్రీట్లో బ్యాక్టీరియాను కలపడం వల్ల లీకులు అరికట్టవచ్చని చేసిన ప్రయోగానికి పేటెంట్, మరో రెండు పేటెంట్లు లభించాయి. యూకేలోని కేంబ్రిడ్జి ప్రెస్ నుంచి 2008లో ఇంటర్నేషనల్ ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్, 2015లో సర్దార్ పటేల్ లైఫ్టైమ్ ఎచీవ్మెంట్, 2016లో గ్లోబల్ టీచర్ రోల్మోడల్ ఆవార్డు లభించాయి.
యోగి వేమన వర్సిటీ: లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీల్లో పీహెచ్డీ, న్యూరోసైన్స్పై పరిశోధించిన ఎస్సీ వర్గానికి చెందిన ఫణితి ప్రకాశ్బాబును యోగి వేమన వర్సిటీ ఉపకులపతిగా ఎంపిక చేశారు. ఫణితి ప్రకాశ్బాబు స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట. అయన విద్యార్హతలు పీహెచ్డీ. బోధనలో 31 ఏళ్లు అనుభవం ఉంది. 2022లో రాయల్ సొసైటీ ఆఫ్ బయోలజీ, అసోసియేషన్ బయోటెక్నాలజీ-ఫార్మసీ ఫెలోస్, బీపీ పాండే మెమోరియల్ ఓరియంటేషన్ అవార్డు-2009 పొందారు. రాయలసీమ వర్సిటీ వీసీ వి. వెంకటబసవరావు, స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి. ఆయన ఐఐటీ ఖరగ్పూర్లో పీహెచ్డీ, ఏయూలో ఎంటెక్ చేసారు. బోధనలో 29 ఏళ్లు, పరిశ్రమలో నాలుగేళ్లు అనుభవం ఉంది. యువ శాస్త్రవేత్త, 2009లో హిందూస్థాన్ లివర్ అవుట్స్టాండింగ్ కెమికల్ ఇంజినీర్ అవార్డు పొందారు.
హమ్మయ్యా! పుస్తకాల మోతకు స్వస్తి - ఇక అన్ని సబ్జెక్టులు కలిపి ఒకే పుస్తకం
త్వరలో క్లినికల్ సైకాలజీ కోర్సులు - ఆ సమస్యతో బాధపడేవారికి ఇక శ్రీరామ రక్ష!