ESI Staff Suspension In Rajamahendravaram: రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన సిబ్బందిని సస్పెండ్ చేశారు. మంత్రి సుభాశ్ ఆదేశాలతో రాష్ట్ర బీమా వైద్య సేవల సంచాలకులు చర్యలను చేపట్టారు. కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ సోమవారం ఆకస్మిక తనిఖీ సమయంలో సంతకాలు చేసి కొందరు వైద్యులు, సిబ్బంది వెళ్లిపోవడాన్ని గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.
మంత్రి సుభాశ్ ఆదేశాలతో ఈఎస్ఐ సిబ్బంది సస్పెన్షన్: విధులను సక్రమంగా నిర్వహించని కారణంగా ఐదుగురు వైద్యులు, నలుగురు కార్యాలయ సిబ్బందిని సస్పెండ్ చేశారు. మంత్రి సుభాశ్ సోమవారం ఆసుపత్రి తనిఖీ చేసిన సమయంలో ఇన్ఛార్జి సూపరింటెండెంట్తో పాటు మరో ముగ్గురు డ్యూటీ డాక్టర్లు విధుల్లో లేరు. వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రి నుంచే బీమా వైద్య సేవల సంచాలకులు ఆంజనేయులుతో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితిని వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ బీమా చందాదారులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని రోగుల సంరక్షణలో ఏదైనా నిర్లక్ష్యం లేదా క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని ఈ సందర్భంగా బీమా వైద్య సేవల డైరెక్టరు ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాజమహేంద్రవరం వైద్యులు, సిబ్బందిపై విధి నిర్వహణ విషయంలో విచారణ జరుగుతోందని, సమగ్ర నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తమ విధులను నిబద్ధతతో, సత్ప్రవర్తనతో నిర్వహించాలని కోరారు. ఈఎస్ఐ పథకం కింద లబ్ధిదారుల సంక్షేమానికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
'సంతకాలు పెట్టేసి వెళ్లిపోతే ఎలా?' - ఈఎస్ఐ ఆస్పత్రి వైద్యులపై మంత్రి ఫైర్
'పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల వివరాలివ్వండి' - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం