Amaravati Capital Works Restarts : రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం-ఉద్దండరాయినిపాలెం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భవన ప్రాంగణంలో మంత్రి నారాయణ కలిసి చంద్రబాబు పూజా కార్యక్రమం నిర్వహించారు. సీఆర్డీఏ ఆఫీసు పనుల ద్వారా రాజధాని పనులను ప్రభుత్వం మొదలు పెట్టింది. రూ.160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్డీఏ చేపట్టింది.
గొప్ప నగరంగా అభివృద్ధి చేస్తాం : ఐదేళ్లుగా అమరావతి రైతులను అనేక ఇబ్బందులు పెట్టారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 4 నెలలు చర్చించి ఇక్కడున్న సాంకేతిక సమస్యలు పరిష్కరించామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు కౌలు చెల్లించామని తెలిపారు. గతంలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. అమరావతిని గొప్ప నగరంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
ఐదేళ్లుగా ఈ ప్రాంతాన్ని చిన్న అడవిగా మార్చారని ఎమ్మెల్యే శ్రవణ్కుమార్ ఆరోపించారు. అమరావతి ప్రాంతాన్ని జగన్ ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లపాటు అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కౌలు సమస్య పరిష్కారమైందని తెలిపారు. కేసులు ఉన్నవారికి తప్ప అందరికీ కౌలు అందుతోందని పేర్కొన్నారు. అమరావతిలోని కూలీలకు పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు వివరించారు. అమరావతి రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. రాజధాని అభివృద్ధి ద్వారా రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీఎం చెప్పారని శ్రవణ్కుమార్ వెల్లడించారు.
ఈ నెల 16న జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించింది. మొత్తం 3.62 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 7 భవనాన్ని 2,42,481 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనుంది. అదనంగా పార్కింగ్, ల్యాండ్ స్కేపింగ్ 2.51 ఎకరాల విస్తీర్ణం, భవనం నిర్మాణం కోసం ఇప్పటివరకూ రూ.61.48 కోట్ల ఖర్చుపెట్టింది. ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్స్, ఇంటీరియర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ సిస్టమ్స్, ఇతర వర్క్స్ ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి. బ్యాలెన్స్ పనుల పూర్తికి రూ.160 కోట్లు ఖర్చు కానుంది.
అమరావతి ఐకానిక్ నిర్మాణాలకు త్వరలోనే టెండర్లు - డిజైన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం