Chandrababu Davos Tour Updates : గ్రీన్ హైడ్రోజన్తోపాటు హరిత ఇంధన రంగంలో ఆంధప్రదేశ్ను అగ్రగామిగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బదులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తమ విధానమని వెల్లడించారు. దావోస్లో రెండోరోజు పర్యటనలో భాగంగా భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి స్వర్ణాంధ్ర-2047 విజన్ టాస్క్ఫోర్స్ సభ్యులు టాటాసన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ సహా సీఐఐ చైర్మన్ చంద్రజీత్ బెనర్జీ తదితరులు హాజరయ్యారు.
ప్రస్తుతం వందకు పైగా దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారని అత్యంత నాణ్యమైన మానవ వనరుల లభ్యతలో ఏపీ అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నారని, తమ ప్రతిభతో రాణిస్తున్నారని చెప్పారు. 25 ఏళ్ల క్రితం బిల్ గేట్స్ ఇంటర్నెట్ ప్రవేశపెట్టారని, 1991లో భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ రెండింటిని అవకాశంగా తీసుకుని ఏపీలో రెండో దశ సంస్కరణలు అమలు చేశామని వాటి ఫలితాలు ఇప్పుడు వచ్చాయని సీఎం అన్నారు.
'సరైన సమయమంలో దేశానికి సరైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారు. చాలా దేశాల్లో రాజకీయ సందిగ్ధత ఉందని భారతదేశంలో అలాంటి గందరగోళ పరిస్థితి లేదు. గతంలో నేను అమలు చేసిన సంస్కరణలతోనే రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. గ్రూప్ ఆఫ్ కాన్సెప్ట్ రూపొందించడంలో ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు దేశంలో నివాసయోగ్యానికి హైదరాబాద్ అత్యంత అనువైనం ప్రాంతంగా తీర్చిదిద్దాం' అని చంద్రబాబు పేర్కొన్నారు.
"జీడీపీ వృద్ధి రేటులోభారతదేశం అగ్రగామిగా ఉందని, ఇదే స్థాయిలో వృద్ధి నమోదు చేస్తామనే నమ్మకం ఉంది. 2028 నుంచి భారత్ యుగం ప్రారంభమవుతుంది. దేశాన్ని ప్రపంచంలో సూపర్ పవర్గా చేసేందుకే వికసిత్ భారత్-2047 ప్రణాళికలను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారు. సంపద సృష్టిలో భారతీయులు అగ్రగామిగా ఎదగడం ద్వారా 2047 నాటికి భారత్ తొలి రెండు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
Chandrababu on Green Industrialization : స్వర్ణాంధ్ర–2047 విజన్ రోడ్మ్యాప్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పది మార్గదర్శక సూత్రాలను ముఖ్యమంత్రి వివరించారు. కాస్ట్ ఆప్టిమైజేషన్, పర్యావరణ సమతుల్యతపై దృష్టి పెట్టి గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్, ఫ్యూయల్ మార్కెట్ల్లో ఏపీని అగ్రగామిగా చేస్తున్నామని చెప్పారు. కాకినాడ వంటి పటిష్టమైన ఓడరేవుల ద్వారా ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ రూపకల్పనలో టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మార్గనిర్దేశాన్ని మరిచిపోలేమన్నారు.
"భవిష్యత్ నాయకులను సిద్ధం చేయడానికి అమరావతిలోని గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ దోహద పడుతుంది. నాయకత్వ వికాసాన్ని పెంపొందించడానికి స్విట్జర్లాండ్కు చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్, జీఎల్సీ మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. పాలనతో పాటు పౌర సేవల్ని సులభతరం చేసేందుకు ఏఐ, సహా రియల్ టైమ్ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. భారతదేశం అందించిన సేంద్రియ వ్యవసాయం ప్రపంచ సమాజానికి ఒక వరంగా మారింది. పీ-4 మోడల్ ద్వారా ప్రభుత్వ-ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యాన్ని ఇటు పాలనలోనూ తీసుకొచ్చాం. హరిత పారిశ్రామికీకరణ, డీప్-టెక్ ఇన్నోవేషన్, సమ్మిళిత నాయకత్వంపై దృష్టి సారించాం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
'రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్కు గ్లోబల్ హబ్గా మార్చడానికి కృషి చేస్తున్నాం. ఇంధన సంస్కరణలు కూడా సుస్థిర అభివృద్ధికి ఒక ఉదాహరణ. అలాగే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతిని సాధించామని, ఇంధన ఖర్చులు తగ్గించగలిగాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు మిషన్ మోడ్ విధానంతో ఏపీని క్లీన్ ఎనర్జీ హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2030 నాటికి 500 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ను, 500 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఇంధన రంగంలో 115 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు వచ్చాయని' సీఎం పేర్కొన్నారు.
ఈవీ వాహనాలు ఉత్పత్తికి ప్రోత్సాహకాలు : ఇటీవలే 21 బిలియన్ డాలర్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును ఇటీవల ప్రధాని విశాఖపట్నంలో శంకుస్థాపన చేశారని ముఖ్యమంత్రి చెప్పారు. అదనంగా, బయో ఫ్యూయల్ రంగంలో రిలయన్స్ రూ.65,000ల కోట్ల పెట్టుబడులు ఏపీలో పెడుతున్నట్లు తెలిపారు. ప్రజలే విద్యుత్ ఉత్పత్తిదారులుగా చేసేలా రూఫ్టాప్ సౌర విద్యుత్ ఏర్పాటును, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి నెట్ జీరో లక్ష్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. డ్రోన్ సాంకేతికతను వ్యవసాయరంగ అభివృద్ధికి వినియోగిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.
యువతలో సరికొత్త ఆలోచనలు రావాలి - చైతన్యవంతులు కావాలి: సీఎం చంద్రబాబు
పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తి సానుకూల వాతావరణం: నారా లోకేశ్