Central Govt Announced Kopparthi Will Converted into Industrial Hub : కొప్పర్తి పారిశ్రామికవాడకు మహార్దశ పట్టింది. విశాఖపట్నం-చెన్నై కారిడార్ లో భాగంగా కొప్పర్తిని పారిశ్రామిక హబ్గా మారుస్తామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడంతో జిల్లా యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2596 ఎకరాల్లో రూ. 2137 కోట్ల వ్యయంతో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. దీంతో 54 వేల మందికి ఉద్యోగవకాశాలు లభించనున్నాయి.
మారనున్న కొప్పర్తి రూపురేఖలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఐదేళ్ల కిందటే విశాఖపట్నం-చెన్నై కారిడార్ లో భాగంగా వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తిని అభివృద్ధి చేయాలని కేంద్రం భావించినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారం లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు చొరవతో ఈ-కారిడార్లో భాగంగా కొప్పర్తిని పారిశ్రామిక హబ్ గా మారుస్తామని కేంద్రమంత్రి వైష్ణవ్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో 2596 ఎకరాల్లో రూ. 2137 కోట్లతో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీనివల్ల 54 వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జిల్లా యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కొప్పర్తి పారిశ్రామికవాడ అభివృద్ధిపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆశించనంత ప్రగతి సాధించలేదు. కొప్పర్తిని పారిశ్రామికవాడగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా మౌలిక వసతుల కల్పనకు సక్రమంగా నిధులు ఖర్చు చేయలేకపోయింది. దీంతో యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. సీఎం చంద్రబాబు చొరవతో కేంద్రం ఇండస్ట్రియల్ సిటీగా కొప్పర్తిని గుర్తించింది. దీంతో భారీ ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి-షేక్ సిద్ధిఖీ, నిరుద్యోగ ఐకాస నాయకుడు
యువతకు మంచి భవిష్యత్తు : పెద్ద పరిశ్రమలు వస్తేనే రాయలసీమలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పారిశ్రామిక వాడలో ప్రస్తుతం 540 ఎకరాలను మాత్రమే ఏపీఐఐసీ అధికారులు అభివృద్ధి చేసి పరిశ్రమల కోసం సిద్ధం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మరో 2596 ఎకరాలు అభివృద్ధి చెందడమే కాకుండా విరివిగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. కాగా కొప్పర్తికి నీటి సమస్యను తీర్చడానికి గత ప్రభుత్వం బ్రహ్మంసాగర్ నుంచి 0.6 టీఎంసీ నీటిని కేటాయించినా టెండర్ల దశలోనే ఆ పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వేగంగా నీటి సమస్య తీరిస్తే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి చూపుతారని జిల్లా వాసులు చెబుతున్నారు.