Congress Party Focus On Joinings : అధికార కాంగ్రెస్లోకి చేరికల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఏఐసీసీ అనుమతిచ్చిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం ఆచితూచి అడుగులేస్తోంది. అధిష్ఠానం అనుమతిచ్చినా నేతల చేరికల పట్ల క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో శ్రేణుల్లో ఏకాభిప్రాయం తెచ్చిన తర్వాతే చేర్చుకుంటున్నాయి. పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమంటూనే రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో చేరికలను ప్రోత్సహించాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. బయట పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎవరికీ ఎలాంటి పదవులు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం పలు వేదికలపై చెప్పకనే చెప్పారు. ఎవరైతే పార్టీ బీ-ఫామ్తో గెలిచారో వారికే పదవులు ఉంటాయని స్పష్టం చేశారు.
No.of MLAs Joined Congress From BRS is 10 : ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, సంజయ్ కుమార్లు కారు దిగి హస్తం గూటికి చేరారు. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సైతం చేతిలో చెయ్యేయటంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏకంగా 10కి చేరింది. హైదరాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో పాటు ఆయా నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
కారుదిగేందుకు 8 మంది ఎమ్మెల్యేలు గ్రీన్సిగ్నల్! : బీఆర్ఎస్కు చెందిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, మేడ్చల్, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్రెడ్డిలు, కుత్బుల్లాపుర్ ఎమ్మెల్యే వివేకానంద, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మినహా మిగిలిన వారితో కాంగ్రెస్ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నగరానికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మిగిలిన వారు సైతం పార్టీలో చేరతారని పీసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అసెంబ్లీ సమావేశాల నాటికి : అయితే ఎమ్మెల్యేల చేరిక పట్ల పలుచోట్ల స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మంత్రులు, కీలక నేతలు రంగంలోకి దిగి ఓ వైపు పార్టీలో చేరే వారితో మంతనాలు జరుపుతూనే, తమ నేతలకు నచ్చచెబుతున్నారు. మరోవైపు ఎలాంటి హామీలేకుండా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇస్తున్నారు. ఈ చేరికల పరంపర కొనసాగుతుందని, ఈ నెల 24న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నాటికి పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 15 దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 10 మంది చేరగా, మరో 16 మంది ఎమ్మెల్యేలు వచ్చినట్టైతే బీఆర్ఎస్ శాసన సభాపక్షం విలీనానికి అవకాశం ఏర్పడుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.