Jagan Tirumala Issue : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్ వివాదం తెచ్చారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు స్పందించారు. మాజీ సీఎంపై వారు విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్కు శ్రీవారి అనుగ్రహం లేదని స్వామివారి ఆశీర్వాదం లేకుంటే ఎవరైనా సరే అలిపిరిలో అడుగుపెట్టలేరని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డి అన్నారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటా : శ్రీవారి దర్శనానికి వచ్చే జగన్ డిక్లరేషన్పై సంతకం పెట్టడానికి ఏమి బాధని భానుప్రకాశ్రెడ్డి ప్రశ్నించారు. ఆయన పులివెందులకు మాత్రమే ఎమ్మెల్యే అని గుర్తుంచుకోవాలని చెప్పారు ఇకనైనా అహంకారం మానుకోవాలని హితవు పలికారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో, తిరుమలలో గాని ఏరోజు దళితులను ఇబ్బంది పెట్టలేదని పేర్కొన్నారు. వారిని ఇబ్బందులకు గురి చేశామని మాజీ ముఖ్యమంత్రి అన్నారని ఆ విషయాన్ని 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. దళితులను కించపరిచినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని, నిరూపించకుంటే రాజకీయాల నుంచి జగన్ పూర్తిగా తప్పుకుంటారా అని సవాల్ విసిరారు.
కోర్టులో తన కేసుల వాయిదాలకు డుమ్మా కొట్టడానికే జగన్ తిరుమల పర్యటనను అడ్డుపెట్టుకున్నారని జనసేన తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుమలలో అల్లర్లు, మతకల్లోలం సృష్టించడానికి యత్నించారని ధ్వజమెత్తారు. లడ్డూలపై విష ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి రోజాపై టీటీడీ కేసు పెట్టాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.
TDP Leaders Fires on YS Jagan : జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహయాదవ్ అన్నారు. ఆయనని తిరుమలకు రావద్దని ఎవరైనా చెప్పారా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రతిపక్ష నాయకులపై దాడులు మర్చిపోయారా అని నిలదీశారు. ఆలయ ఆచారాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని మాజీ ముఖ్యమంత్రికి అది లేకపోవడం దురదృష్టకరమన్నారు. నిర్బంధ పరిపాలన చేసిన చరిత్ర జగన్దని విమర్శించారు తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని నరసింహయాదవ్ వ్యాఖ్యానించారు.
టీటీడీలో అవినీతి జరిగింది : శ్రీవారి దర్శనానికి వచ్చే జగన్ డిక్లరేషన్పై సంతకం పెట్టడానికి ఏమైందని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో టీటీడీలో అవినీతి జరిగిందని ఆరోపించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని సేవా టిక్కెట్లను బ్లాక్లో అమ్మేశారని విమర్శించారు. 2004లో మాజీ ముఖ్యమంత్రి కుటుంబ ఆస్తులెంత 2024లో ఆస్తులెంత అని నిలదీశారు. మానవత్వం, సెక్యులరిజం, దళితుల గురించి జగన్ మాట్లాడటం హస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ హయంలో వారికి అన్యాయం చేశారని చింతామోహన్ ఆరోపించారు.