Government Plans To Replace Minimum Wage With Living Wage : మన దేశంలో 'కనీస వేతన వ్యవస్థ'కు స్వస్తి పలికి 'జీవన వేతన వ్యవస్థ'ను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇదే కనుక జరిగితే జీతం లెక్క మారుతుంది. కార్మికుల, ఉద్యోగుల సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
What Is Living Wage : జీవన వేతనం అనేది కార్మికుడు తన ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి కావాల్సిన కనీస ఆదాయం. ఇందులో గృహం, ఆహారం, ఆరోగ్య సంరక్షణ, విద్య, దుస్తులు ఉన్నాయి.
మనదేశంలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు, కార్మికల ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు 'కనీస వేతన చట్టం' తీసుకువచ్చారు. దీనితో ప్రజల ఆర్థిక స్థితిగతులు కొంతమేర మారాయి. ముఖ్యంగా కార్మికులకు అందాల్సిన కనీస వేతనాలు చాలా వరకు పెరిగాయి. దీని వల్ల కంపెనీలపై, పారిశ్రామిక సంస్థపై వేతన ఖర్చుల భారం ఎక్కువైంది. దీని నుంచి తప్పించుకునేందుకు ఆయా సంస్థలు చాలా ప్లాన్స్ వేశాయి. చట్టంలోని లోపాలను అవకాశంగా మార్చుకునే ప్రయత్నాలు కూడా చేశాయి. దీంతో చాలా కంపెనీల్లోని ఉద్యోగులకు, కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం, వేతనాలు అందడం లేదు.
జీవన వేతనం
కార్మికులకు, ఉద్యోగులకు జరుగుతున్న ఈ నష్టాన్నినివారించేందుకు కనీస వేతన చట్టాన్ని మరింత పకడ్భందిగా అమలు చేయాలన్న వాదనలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. కనీస వేతన చట్టం నియమ, నిబంధనలను గతంలో కంటే బలంగా మారిస్తే, ఉద్యోగులకు మేలు జరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అందుకే ఈ విషయంపై మోదీ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. కనీస వేతనాల వ్యవస్థను పూర్తిగా పక్కనపెట్టి, దాని స్థానంలో 'జీవన వేతన విధానాన్ని' తీసుకురావాలని యోచిస్తోంది.
ఐఎల్ఓ గవర్నింగ్ బాడీ మీటింగ్ లో ఆమోదం:
మార్చి 14న జెనీవాలో జరిగిన ఐఎల్ఓ గవర్నింగ్ బాడీ 350వ సమావేశంలో కనీస వేతనానికి సంబంధించిన సంస్కరణలను ఆమోదించారు. భారతదేశంలో 50 కోట్లకు పైగా కార్మికులు ఉన్నారు. వారిలో 90% మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. వారికి కనీస వేతనం రోజుకు రూ.176 లేదా అంతకంటే కాస్త ఎక్కువగా ఉంది. ఇది మీరు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే 2017 నుంచి జాతీయ స్థాయిలో కనీస వేతనంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇది ఆయా రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని రాష్ట్రాలల్లోని కార్మికులకు కనీస వేతన స్థాయి కంటే చాలా తక్కువ మొత్తంలో జీతం ఇస్తున్నారు.
మరోవైపు 2019లో ఆమోదించిన వేతన నియమావళి ఇంకా అమల్లోకి రాలేదు. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన వేతన స్థాయిని ప్రతిపాదిస్తుంది. అయితే ఇప్పుడు లివింగ్ వేజ్ ద్వారా వేతన వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చాలంటూ ఐఎల్ఓ కోరింది. అందుకే భారత్ 2025లో కనీస వేతన వ్యవస్థ స్థానంలో జీవన వేతన వ్యవస్థను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న దాదాపు 50కోట్ల మంది కార్మికుల్లో 90శాతం మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది కనీస వేతనాలను పొందడం లేదు.
జీవన వేతన వ్యవస్థతో ఎలాంటి మార్పులు ఉంటాయి:
మనిషికి కావాల్సిన కనీస అవరాలు ఆహారం, దుస్తులు, ఆశ్రయం వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుంటారు. మారుతున్న కాలం, సాంకేతికతో పాటు కనీస అవసరాల్లో మరిన్ని అంశాలు చేర్చారు. కార్మికుడి సామాజిక అభ్యున్నతికి అవసరమైన అన్ని కీలకాంశాలపై శ్రద్ధ ఉంటుంది. ఈ వ్యవస్థలో కార్మికుడితోపాటు అతని కుటుంబానికి సామాజిక భద్రత పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఐఎల్ఓలో శాశ్వత సభ్యత్వం:
భారతదేశం ఐఎల్ఓలో 1922 నుంచి శాశ్వత సభ్య దేశంగా ఉంది. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్డీజీ) సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. కనీస వేతనాన్ని జీవన వేతనంతో భర్తీ చేయడం వల్ల లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేయడానికి వీలు కలుగుతుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
బీ అలర్ట్ - ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి న్యూ ట్యాక్స్ రూల్స్! - NEW TAX RULES 2024
2024 ఏప్రిల్ నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays In April 2024