బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయడం కంటే - ఓటర్లు ఇంట్లో కూర్చోవడం బెటర్ : కేఏ పాల్
Published : Nov 24, 2023, 7:31 PM IST
KA Paul Election Campaign at Vemulawada :తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీని ఓడించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. ఆ పార్టీలకు ఓటు వేసే బదులు.. ఓటర్లు ఇంట్లో కూర్చోవాలని చెప్పారు. వేములవాడలో కేఏ పాల్ తమ పార్టీ అభ్యర్థి అజ్మీర మహేష్ బాబు తరఫున శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేద పిల్లలకు ఉచిత విద్య, వైద్యం కోసం సదాశివపేటలో 1200 ఎకరాల్లో ఛారిటీస్ కట్టించానని తెలిపారు.
బీఆర్ఎస్.. ఎలక్షన్ కమిషన్ చట్టానికి విరుద్ధంగా తమ పార్టీ అడిగిన రింగు గుర్తు ఇవ్వకుండా చేశారని కేఏ పాల్ చెప్పారు. గెలిచిన నెలలోపే వేములవాడలో ఉచిత హాస్పిటల్, ఉచిత విద్య, వైద్యం, కంపెనీలు పెట్టి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబపాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్లకు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. బర్రెలక్కపై దాడిని పూర్తిగా ఖండిస్తున్నానని, ఆమెకు పూర్తి అండగా ఉండి మద్దతిస్తానని తెలిపారు.