దావోస్కు వెళ్తే డబ్బులు దండగా అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు వెళ్లారు : హరీశ్రావు
Published : Jan 18, 2024, 5:59 PM IST
BRS MLA Harish Rao On Lok Sabha Elections : కేటీఆర్ అప్పట్లో దావోస్కు వెళ్తే డబ్బులు దండగా అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని మంత్రి హరీష్రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాహుల్గాంధీ బస్సుయాత్రలో మాట్లాడుతూ ఈ దేశం ఇద్దరి చేతుల్లో ఉందని, అదానీ, అంబానీలు అవినీతిపరులన్నారని తెలిపారు. ఈ ఇద్దరి వ్యక్తుల మధ్య 500 కంపెనీలు ఉన్నాయని వారి అవినీతి వెనుక ప్రధాని ఉన్నారంటూ రాహుల్ అన్న వ్యాఖ్యలను హరీష్రావు గుర్తు చేశారు. వారు అలా మాట్లాడుతుంటే సీఎం రేవంత్రెడ్డి మాత్రం వాళ్ల దగ్గరికి వెళ్లి ఆలింగనం చేసుకుంటున్నారని, ఇద్దరిలో ఎవరి మాటలు నమ్మాలో చెప్పాలన్నారు.
ఈరోజు మతతత్వ పార్టీ అయినా బీజేపీపై పోరాటం చేసింది, రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకుపోయింది బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీతో కొట్లాడుతామని, కానీ పాలమూరుకు జాతీయ హోదా కల్పించారని కేంద్ర మంత్రిని కోరితే వాళ్లు ఇవ్వమని చెప్పారు, మరి ఎక్కడ కొట్లాడుతున్నారని ప్రశ్నించారు. వారికి పూలదండలు వేయడంలో కాంగ్రెస్ నేతలు కొట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ నడక ప్రారంభించారని మరో 15 రోజుల్లో ఆయన ఆరోగ్యం కుదుట పడగానే గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి వస్తారని తెలిపారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా తాను 24గంటలు అందుబాటులో ఉంటానంటూ వారికి భరోసా ఇచ్చారు.