Boinapalli Vinod Kumar on Floods : 'రేపు కేబినెట్ మీటింగ్లో ఆ అంశాలన్నింటినీ సీఎం కేసీఆర్కు వివరిస్తా'
Boinapalli Vinod Kumar on Telangana Floods 2023 : గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో దెబ్బ తిన్న పంట, ఆస్తి నష్టం వివరాలను రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, కరీంనగర్ జిల్లా శంకరపట్నం, రామడుగు మండలాల్లో వినోద్ కుమార్ పర్యటించారు. అలాగే గండి పడిన కాల్వ ప్రాజెక్ట్ మత్తడిని పరిశీలించిన ఆయన.. దానివల్ల పంటలకు కలిగిన నష్టాన్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా రైతులకు సాగు నీరందిస్తున్న ప్రాజెక్టుకు గండి పడటంతో ప్రజలకు ఇబ్బంది తప్పలేదన్నారు. మోతె వాగు కోతకు గురి కావడంతో రైతులు తమ భూములు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతేకాకుండా ఎన్నో గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయిందని వినోద్ పేర్కొన్నారు. రామడుగు ప్రాంతంలో దెబ్బతిన్న కల్వర్టులు, చెరువులకు జరిగిన నష్టంపై సహకార ఛైర్మన్ వీర్ల వెంకటేశ్వర్ రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో చర్చించారు. ఆయా అంశాలన్నింటిన్నీ రేపు కేబినెట్ సందర్భగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు.