కడుపు నిండా భోజనం చేసేసి 'హమ్మయ్య.. ఓ పనైపోయింది' అనుకునేవారు ఎందరో. ఒకసారి భోజనం చేశాక మరేమీ తినాల్సిన అవసరముండదన్నది వీరి భావన. నిజానికి ఒకేసారి కడుపు నిండా భోజనం చేయటం కన్నా కొద్ది కొద్దిగా తినటం.. అవసరమైతే కాస్త ఆకలి అనిపించినప్పుడు మధ్యలో ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తినటం మంచిది. ఇది శరీరానికే కాదు, మనసుకూ మేలు చేస్తుంది. చిరుతిళ్లతో బరువు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతుంటే.. మరికొన్ని ఖండిస్తున్నాయి. వీటి మాటెలా ఉన్నా చిరుతిళ్ల మూలంగా ఒకేసారి పెద్ద మొత్తంలో తినకుండా చూసుకోవచ్ఛు ఎందుకంటే అతిగా ఆకలి వేయటం తగ్గుతుంది.
మన శరీరం ఎప్పుడూ మనతో ఏదో చెప్పాలనే అనుకుంటూ ఉంటుంది. దాన్ని వినటం మంచిది. కడుపులో చిన్నగా ఆకలి అవుతున్నట్టు అనిపిస్తే ఏదో ఒకటి నోట్లో వేసుకోవటమే ఉత్తమం. అలాగని చిప్స్, కేక్లు, చాక్లెట్లు, కూల్డ్రింకుల వంటి వాటి జోలికి వెళ్లటం తగదు. ఇవి రక్తంలో గ్లూకోజు త్వరగా కలిసేలా చేస్తాయి. వీటితో లభించిన హుషారు కాసేపటికే ఆవిరవుతుంది. వీటికన్నా బాదం, జీడిపప్పు, అక్రోట్ల వంటి గింజపప్పులు (నట్స్), పండ్లు తీసుకోవటం మంచిది. గింజపప్పుల్లోని బహుళ అసంతృప్త కొవ్వులు, పీచు, ప్రొటీన్, మెగ్నీషియం, క్యాల్షియం గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. తరచూ బాదం పప్పు తీసుకుంటుంటే మంచి (హెచ్డీఎల్) కొలెస్ట్రాల్ మెరుగవుతుంది. ప్రొటీన్తో కండర మోతాదు, శక్తి పుంజుకుంటాయి. మనం భోజనం చేసినప్పుడు శరీరం అందులోని ప్రొటీన్ను పూర్తిస్థాయిలో స్వీకరించకపోవచ్ఛు అదే అప్పుడప్పుడు ప్రొటీన్తో నిండిన చిరుతిళ్లు తీసుకుంటే దాన్ని రోజంతా లభించేలా చూసుకోవచ్ఛు ఇది 60 ఏళ్లు పైబడినవారికి మరింత ముఖ్యం.