వరంగల్లో రుణాల పేరిట మోసం రుణాల ఆశ చూపి అందినంతా దోచుకున్నారు. మైనార్టీ సంఘాలు ఏర్పాటు చేసి ఫోర్జరీ సంతకాలతో మహిళలను బురిడీ కొట్టించాడు. ఒక్కో సంఘం పేరిట లక్షల్లో రుణాలు పొందారు. ఏళ్లు గడిచినా... ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. చివరికి బ్యాంకు నోటీసులతో వారి బాగోతం బట్టబయలైంది. వరంగల్ అర్బన్ జిల్లా ఉర్సు కరీమాబాద్లో.. ఇద్దరు వ్యక్తులు నిరుపేద ముస్లిం మహిళలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్కరికీ పది వేల చొప్పున రుణాలిస్తామంటూ పది మందికో గ్రూపు ఏర్పాటు చేశారు. సభ్యులందరివీ ఆధార్ కార్డులు, ఫొటోలు సేకరించి.. ఒక్కో సంఘం పేరిట 5లక్షల చొప్పున దాదాపు 75కోట్ల రుణం తీసుకున్నారు. మహిళలు ఎన్నిసార్లు అడిగినా ఇంకా డబ్బులు రాలేదంటూ మాయమాటలు చెబుతూ కాలం వెళ్లదీశారు. ఇంతలోనే బ్యాంకు అధికారులు డబ్బులు కట్టమని నోటీసులు పంపారు. లేకుంటే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. ఏం జరుగుతుందో అర్థంకాక మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, హన్మకొండ కెనరా బ్యాంకు అధికారులు కలిసి మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.రుణాల పేరుతో పేదలను మోసం చేస్తున్న వారిని శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.