తెలంగాణ

telangana

Occupied forest lands:అటవీ భూముల ఆక్రమణకు యత్నం... అడ్డుకున్న అధికారులు

By

Published : Nov 9, 2021, 12:46 PM IST

రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంచేందుకు వేల కోట్లు వెచ్చించి హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు అటవీ భూములను ఆక్రమించేందుకు తెగపడుతున్నారు. రాత్రికి రాత్రే అటవీశాఖ సరిహద్దు దిమ్మ లను మట్టితో కప్పి... హరిత హారంలో నాటిన మొక్కలను తొలగించి ఆ భూములను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. ఈ వ్యవహారమంతా జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో ఉండటం గమనార్హం.

occupied forest lands
occupied forest lands

వికారాబాద్ జిల్లా అనంతగిరి ప్రాంతంలోని అటవీ భూములను ఆక్రమించేందుకు కొందరు భూకబ్జా దారులు యత్నిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన భూముల్లోకి వెళ్లేందుకు అటవీ భూములు అడ్డు వస్తుండటంతో వాటి ఆక్రమణకు తెగపడుతున్నారు. రాత్రికి రాత్రే అటవీశాఖ సరిహద్దు దిమ్మలను మట్టితో కప్పి అటవీశాఖ చెట్లు, హరితహారంలో నాటిన మొక్కలను తొలగించి భూమిని చదును చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్రాంతం నుంచి మట్టి తరలించారు.

హరితహారంలో నాటిన మొక్కలను తొలగించి భూమిని చదును చేసిన ఆక్రమణదారులు

ఈ వ్యవహారమంతా జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో ఉండటంతో... భూ కబ్జా వ్యవహారాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. అటవీశాఖ భూమి సరిహద్దు వరకు కందకం తవ్వి ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకున్నారు. అయితే కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీని వెనుక రాజకీయ నేతల హస్తం ఉందని... అందుకే వారిపై చర్యలకు అధికారులు వెనుకాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అటవీశాఖ సరిహద్దు దిమ్మ లను మట్టితో కప్పిన భూకబ్జా దారులు

ఇదీ చదవండి:Minister Niranjan Reddy: 'తగ్గించిన కోటాను మార్చిలోగా పంపించండి'

ABOUT THE AUTHOR

...view details