ఈ ఏడాది రైతుబంధు పథకం కింద యాసంగి పంట కోసం రూ. 5,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో రూ.1.27 కోట్లతో నిర్మించిన రైతుబజార్ను జడ్పీ ఛైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఏఎంసీ ఛైర్మన్ మల్లికార్జున్ గుప్తాతో కలిసి ఆయన ప్రారంభించారు.
క్లిష్ట పరిస్థితుల్లోనూ అన్నదాతకు అండగా ఉన్నాం: హరీశ్
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో నూతనంగా నిర్మించిన రైతుబజార్ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రైతుబంధు పథకం కింద రూ.7,500 కోట్ల గాను రూ.5,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. మిగిలిన రూ. 2 వేల కోట్లు కూడా రెండుమూడ్రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
యాసంగిలో రైతుల ఖాతాలో రూ.7500 కోట్లు జమచేయాల్సి ఉందని, ఆదివారం నాటికి రూ.5500 కోట్లు జమ చేశామన్నారు. కరోనాతో ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు అందించే సహాయంలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి వివరించారు. వానాకాలం సీజన్లో పెట్టుబడి సాయం కింద జిల్లాలో 2,88,261 మంది రైతులకు రూ.366 కోట్లు అందించినట్లు తెలిపారు. యాసంగిలో ఇప్పటిదాకా 2.62 లక్షల మంది ఖాతాల్లో రూ.248 కోట్లు జమ చేశామన్నారు. తెలంగాణలో అందించే రైతు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో రైతులు తమ సమస్యలపై పోరాటాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు.
ఇవీ చూడండి:రైతుబంధు ఖాతాల్లో రూ. 5,660 కోట్లు జమ