తెలంగాణ

telangana

By

Published : Jul 1, 2021, 5:31 PM IST

ETV Bharat / state

KTR:'ఆకుపచ్చ తెలంగాణే ధ్యేయం... దేశానికే పాఠాలు నేర్పేలా ఎదగాలి'

పచ్చదనం కోసం చేస్తున్న మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం విజయవంతమై... తెలంగాణ రాష్ట్రం దేశానికి పాఠాలు చెప్పేలా ఎదగాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. కరోనా ప్రభావం చూశాకా పిల్లలు, భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటి సంరక్షించాలన్న సోయి అందరికీ రావాలని కోరారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట అర్బన్ ఫారెస్ట్ పార్కులో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కేటీఆర్... ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Harithaharam
హరితహారం

ఆకుపచ్చ తెలంగాణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న హరితహారం (Harithaharam) కార్యక్రమంలో ఏడో విడత ప్రారంభమైంది. ఆరు దఫాల్లో ఇప్పటివరకు 220 కోట్ల మొక్కలు నాటగా... ఈ విడతలో మరో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పురపాలక, అటవీశాఖ మంత్రులు కేటీఆర్​ (KTR), ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy)... రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట కలాన్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అభివృద్ధి చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం పార్క్​లో మొక్కలు నాటి.. కలియతిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులను అందరి అభినందనలను పొందుతున్నాయన్న అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి... ఇదే స్ఫూర్తితో కేంద్రం నగరవన్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. రూ. 650 కోట్ల వ్యయంతో అటవీ, పురపాలక శాఖలు, టీఎస్ఐఐసీ, హెచ్ఎంఆర్ఎల్​లు అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నాయని అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు...

హరితహారంతో భారతదేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్న అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... భావితరాల వారి కోసం ఆస్తులు, అంతస్తులు కాదు... చెట్లు నాటి సంరక్షించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. అడవులను బాగా సంరక్షించుకోవాలన్న ఆయన... అర్బన్ ఫారెస్ట్ పార్కులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. కరోనా రెండో దశలో దేశం తల్లడిల్లిపోయిందని, ఆక్సిజన్ అందక, సరిపడక ప్రాణాలు పోవడం అందరినీ కలచివేసిందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

చనిపోయే వరకు ఉండేది చెట్టు...

ప్రస్తుత పరిస్థితుల్లో హరితహారాన్ని మించిన ఉదాత్త, గొప్ప కార్యక్రమం లేదన్న కేటీఆర్... భవిష్యత్ కోసం పుడమిని కాపాడుకునేందుకు అందరం సమష్టిగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రూ. 5,900 కోట్ల వ్యయంతో 220 కోట్ల మొక్కలు నాటి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవప్రయత్నం రాష్ట్రంలో కొనసాగుతోందని చెప్పారు. తెలంగాణలో పచ్చదనం 23.4 శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపిందని వివరించారు. మానవాళికి అత్యవసరమైన ప్రాణవాయువును అందించడంలో 129 అర్బన్ ఫారెస్ట్ పార్కులు కీలకంగా మారతాయన్న మంత్రి... పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన వెంట ఉండేది చెట్టు మాత్రమేనని అన్నారు.

కేసీఆర్ పుణ్యంతో...

మన పిల్లలు, భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటి సంరక్షించాలన్న అన్న సోయి అందరికీ రావాలని కేటీఆర్ అన్నారు. పచ్చదనాన్ని 33 శాతానికి చేరుకోవాలన్న కేసీఆర్ కల నెరవేరి దేశానికే పాఠాలు చెప్పే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి పుణ్యంతో దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం కలుగుతోందన్నారు. ఏడో దఫా హరితహారంలో భాగంగా ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయనున్నారు. రహదారుల వెంట మొక్కలు నాటడం, ఐదు నుంచి పదెకరాల విస్తీర్ణంలో బృహత్ ప్రకృతి వనాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇదీ చదవండి:KTR: ఇంటింటికి నల్లా .. కేసీఆర్​ ఘనతే

ABOUT THE AUTHOR

...view details