ఆకుపచ్చ తెలంగాణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న హరితహారం (Harithaharam) కార్యక్రమంలో ఏడో విడత ప్రారంభమైంది. ఆరు దఫాల్లో ఇప్పటివరకు 220 కోట్ల మొక్కలు నాటగా... ఈ విడతలో మరో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పురపాలక, అటవీశాఖ మంత్రులు కేటీఆర్ (KTR), ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy)... రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట కలాన్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అభివృద్ధి చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం పార్క్లో మొక్కలు నాటి.. కలియతిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులను అందరి అభినందనలను పొందుతున్నాయన్న అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి... ఇదే స్ఫూర్తితో కేంద్రం నగరవన్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. రూ. 650 కోట్ల వ్యయంతో అటవీ, పురపాలక శాఖలు, టీఎస్ఐఐసీ, హెచ్ఎంఆర్ఎల్లు అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నాయని అన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు...
హరితహారంతో భారతదేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్న అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... భావితరాల వారి కోసం ఆస్తులు, అంతస్తులు కాదు... చెట్లు నాటి సంరక్షించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. అడవులను బాగా సంరక్షించుకోవాలన్న ఆయన... అర్బన్ ఫారెస్ట్ పార్కులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. కరోనా రెండో దశలో దేశం తల్లడిల్లిపోయిందని, ఆక్సిజన్ అందక, సరిపడక ప్రాణాలు పోవడం అందరినీ కలచివేసిందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.