తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2020, 9:49 AM IST

ETV Bharat / state

రైల్వే ఉద్యోగి పారాగ్లైడింగ్​ విన్యాసాలు

పట్టుదల ఆసక్తి ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపించారు పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన ఆడెపు అర్జున్‌. రైల్వేశాఖలో ఉద్యోగం చేస్తున్న అతను... చిన్నప్పటి నుంచే పారాగ్లైడర్‌ నిర్మాణం, అడ్వెంచర్స్‌ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. పారాగ్లైడర్‌ నిర్మాణంతోపాటు గాలిలో విన్యాసాలు నిర్వహించి స్థానికులను ఆశ్చర్య పరిచారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా చేసిన ప్రయోగం విజయవంతమైనందున... ప్రభుత్వం తనకు సహకరిస్తే మరిన్ని అడ్వెంచర్స్‌ చేయడానికి సిద్ధమంటున్నారు.

railway employee arjun paragliding in ramagindam
రైల్వే ఉద్యోగి పారాగ్లైడింగ్​ విన్యాసాలు

రైల్వే ఉద్యోగి పారాగ్లైడింగ్​ విన్యాసాలు

పర్వత, పర్యాటక ప్రాంతాలకే పరిమితమైన పారాగ్లైడింగ్‌ తమ ప్రాంతంలో ఎందుకు నిర్వహించకూడదనే పట్టుదలతో పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన ఆడెపు అర్జున్‌ గత మూడేళ్లుగా కృషి చేస్తున్నారు. రామగుండం రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు పారాగ్లైడర్ నిర్మాణంపై అవగాహన పెంచుకొని నిర్మించారు. పారాగ్లైడింగ్‌ ఎక్కువగా జరిగే హిమాచల్​ప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి అవగాహన పెంచుకున్నారు. పారాగ్లైడింగ్‌కు సంబంధించిన వాట్సప్ గ్రూపులో చేరి ఎప్పటికప్పుడు సాంకేతికంగా తనకు తానుగా అభివృద్ది పరుచుకున్నారు అర్జున్‌. దేశవ్యాప్తంగా రిటైర్డు ఆర్మీ అధికారులు, పైలట్లు, క్రీడాకాకారులు, పారాగ్లైడర్ల నుంచి నిర్మాణానికి సంబంధించిన పరిజ్ఞానం పెంచుకున్నారు. దీని నిర్మాణం మనదేశంలో జరగకపోవడం వల్ల... స్వయంగా నిర్మించాలనే పట్టుదలతో అమెరికా, ఇటవీ నుంచి దాదాపు రూ.15 లక్షలతో అవసరమైన సామాగ్రి తెప్పించారు.

పర్యాటకంగా అభివృద్ధి..

ఇటీవల కాళేశ్వరం జలాలు తరలిరావడం వల్ల గోదావరిఖని, రామగుండాన్ని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పారాగ్లైడింగ్‌కు కూడా మంచి అవకాశాలు ఉంటాయని ఆడెపు అర్జున్ చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎవరు పారాగ్లైడర్‌ తయారు చేయలేదని... తానే మొట్టమొదటిసారి రూపొందించినట్టు వివరించారు. ఎంతో కష్టపడి రూపొందించిన పారాగ్లైడర్‌లో విన్యాసం... తన స్నేహితులతో కలిసి రామగుండం గ్రౌండ్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో చేపట్టారు. స్నేహితులు, స్థానికుల కేరింతలు ఈలల మధ్య ఉవ్వెత్తున గాలిలో విన్యాసాలు చేశారు. పారాగ్లైడర్‌ ద్వారా విన్యాసానికి అనుమతివ్వాలంటూ అధికారులకు విన్నవించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని అర్జున్ చెబుతున్నారు.

ప్రభుత్వం ప్రోత్సహిస్తే..

ఉద్యోగం చేస్తూనే... ఎంతో ఆసక్తితో పారాగ్లైడర్ నిర్మాణం పూర్తి చేసినా... గాలిలో విన్యాసం మాత్రం తమలో ఎంతో ఉద్వేగాన్ని పెంచిందని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నారు. ఆసక్తిగా ఉన్న అర్జున్‌ను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నారు. రాష్ట్ర రాజధానిలో జరిగే పారాగ్లైడింగ్‌‌ విన్యాసాలకు ఇతర రాష్ట్రాలవాసులను ఆహ్వానిస్తుంటారని... ఇక్కడి వారిని ప్రోత్సహిస్తే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందడమే కాకుండా ఉపాధికి అవకాశాలు మెరుగుపడతాయంటున్నారు స్థానికులు.

ఇదీ చూడండి:దేశంలో 90వేలు దాటిన కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details