నిజామాబాద్ జిల్లాలో మొదటి లాక్డౌన్ సమయంలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.. రెండోసారి లాక్డౌన్ విధించే సమయానికి వైరస్ వ్యాప్తిని అధికారులు కట్టడి చేయగలిగారు. మూడోసారి లాక్డౌన్ సమయానికి పరిస్థితులు మరింత మెరుగుపడ్డాయి.
ఎప్పుడు ఎలా...
* జిల్లాలో కరోనా పాజిటివ్ మొదటి కేసు మార్చి 28న జిల్లా కేంద్రంలో నమోదైంది. 21 రోజుల్లో 55 పాజిటివ్ కేసులొచ్చాయి. వీరంతా మర్కజ్కు వెళ్లివచ్చినవారే ఉండటంతో అధికారులు అప్రమత్తమై 420 మందిని క్వారంటైన్కు తరలించారు.
* లాక్డౌన్ రెండో దశ వచ్చేసరికి కరోనా వైరస్ వ్యాప్తి లేకుండా అడ్డుకోగలిగారు. వైద్యశాఖ 22 క్లస్టర్లు, భద్రత కోసం పోలీసులు 12 జోన్లుగా విడదీసి ఇంటింటి సర్వేచేశారు. ఇంతటితో ఆగకుండా మొదటి దశలో ఎక్కువ కేసులు వచ్చిన ప్రాంతాలను రెడ్జోన్గా గుర్తించి రాకపోకలు కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 15 నుంచి 20 వరకు 150 మందిని క్వారంటైన్ చేస్తే కేవలం జిల్లా వ్యాప్తంగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఒక చోట మినహా కంటెయిన్మెంటు ప్రాంతాల తొలగింపు...
నగరంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంటెయిన్మెంట్ క్లస్టర్లను మంగళవారం నుంచి తొలగించనున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆటోనగర్, పెంయిటర్ కాలనీ, హబీబ్ నగర్, మాలపల్లి, ముజాయిద్ నగర్, బర్కత్పుర, ఖిల్లా, ఎల్లమ్మగుట్ట, చంద్రశేఖర్ కాలనీ, దుబ్బ, మానిక్భండార్ ప్రాంతాల్లోని క్లస్టర్లను ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. నాందేవ్వాడలో మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయని, అవి కూడా సాయంత్రం 6 గంటల లోపు మూసివేయాలన్నారు.
కందకుర్తి ఫ్రీజోన్...
రెంజల్ మండలం కందకుర్తి ఫ్రీజోన్గా మారిందని అధికారులు సోమవారం ప్రకటించారు. గత నెలలో గ్రామానికి చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గ్రామంలోని కొంతప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్గా గుర్తించి పకడ్బందీ చర్యలు చేపట్టారు. కాలనీ చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. నెలరోజుల నుంచి కేసులు రాకపోవడం వల్ల ఫ్రీజోన్గా ప్రకటించారు. తహసీల్దార్ అసదుల్లాఖాన్, ఎంపీడీవో గోపాలకృష్ణ, వైద్యాధికారిణి క్రిస్టినా గ్రామానికి వెళ్లి కంచెలను తొలగించారు.
ఇప్పుడు ఎలా ఉందంటే...
కరోనా పాజిటివ్ కేసుల నమోదులో మొదట్లో రాష్ట్రంలోనే ఇందూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. తర్వాత అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగారు. దీంతో జిల్లా ఆరెంజ్ జోన్కు మారింది. ఇక కొత్త కేసులు నమోదు కాకపోతే తొందరలోనే జిల్లా గ్రీన్జోన్లోకి వెళ్లనుంది.