Student died in Basara RGUKT :నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్గాంధీ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఇటీవల దీపిక అనే విద్యార్థిని మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తాజాగా మరో విద్యార్థిని మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన లిఖిత (17) ఆర్జీయూకేటీలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతుంది. వసతిగృహంలో ఉంటున్న లిఖిత బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో నాలుగో అంతస్తు నుంచి కిందపడింది. గమనించిన భద్రతా సిబ్బంది క్యాంపస్ హెల్త్ సెంటర్లో ఆమెకు ప్రథమ చికిత్స చేపించారు. అనంతరం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Basara Student Likhita death News : ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిర్మల్లో లిఖితను చూసిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదమా,ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లిఖిత గజ్వేల్కు చెందిన బుర్ర రాజు, రేణుకల పెద్ద కుమార్తె. రాజు గజ్వేల్లో మిర్చిబండి నిర్వహిస్తూ తమ పిల్లలను చదివిస్తున్నాడు. లిఖిత ఇంటి నుంచి వారం రోజుల క్రితమే హాస్టల్కు వెళ్లింది. ఇంతలోనే తమ కూతురు మృతి చెందిందనే వార్త తెలిసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Another Student died in Basara IIIT :బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న విద్యార్థుల మరణాలు.. ప్రభుత్వ హత్యలే అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి ఆరోపించారు. ట్రిపుల్ ఐటీలో వరుసగా విద్యార్థులు మరణించడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. విద్యార్థుల మరణాలపై వెంటనే జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు.