తెలంగాణ

telangana

ETV Bharat / state

గుట్టలకు పట్టా పుస్తకాలు... అధికారుల అక్రమాలు

భూమికి పట్టాదారు పాసు పుస్తకాలివ్వడం మనం చూశాం. ప్రభుత్వానికి సంబంధించిన గుట్టలకు సైతం పట్టా పుస్తకాలిచ్చి అడ్డగోలుగా బ్యాంకు నుంచి రుణాలు పొందారు కొందరు అక్రమార్కులు. అధికారులు, రాజకీయ అండదండలతో రైతుబంధు నిధులు కూడా కాజేశారు. నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం పేర్వాల గ్రామంలోని రాజుల గండి గుట్టలో అక్రమాలపై ప్రత్యేక కథనం...

By

Published : May 5, 2019, 12:10 AM IST

రాజుల గండి గుట్ట

రాజకీయ అండదండలతో అక్రమార్కులు సర్కారుకు సంబంధించిన గుట్టలను సైతం వదలడం లేదు. నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం పేర్వాల గ్రామంలోని సర్వే నెం.49లో 32 ఎకరాల విస్తీర్ణంలో రాజులగండి గుట్ట ఉంది. భూ దస్త్రాల ప్రక్షాళనలో భాగంగా అక్కడ ఓ రెవెన్యూ అధికారి తన 15 మంది అనుయూయులకు గుట్టను పట్టాలుగా చేసి అందించారు. భూమి లేని నిరుపేదలకు అసైన్​మెంట్​ కమిటీ ద్వారా పట్టాలు జారీ చేయాల్సిన అధికారులు నిబంధనలు పాటించకుండా ఇతరులకు పట్టాలివ్వడం గమనార్హం.

అక్రమంగా రుణాలు

కాసులకు కక్కుర్తి పడ్డ రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా గుట్టలు, వాగులకు పట్టాలు జారీ చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. భూ దస్త్రాల నవీకరణ సమయంలో గ్రామస్థాయి సిబ్బంది ఏకమై చేతివాటం మొదలు పెట్టారు. పేర్వాల గ్రామ శివారులో సాగుకు యోగ్యం లేని మూడెకరాలు బండకు పట్టాలు జారీ చేశారు. పట్టా పాసుపుస్తకాలతో అక్రమార్కులు వివిధ బ్యాంకుల్లో లక్షల్లో పంట రుణాలు పొందారు. రైతుబంధు సొమ్మును సైతం కాజేశారనే ఆరోపణలున్నాయి.

ఇలా వెలుగులోకి..

గ్రామస్థుల ఆందోళనతో పేర్వాల గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రవీందర్​రెడ్డి అక్రమంగా పట్టాలు చేసిన గుట్టలకు సంబంధించిన కీలక దస్త్రాలతో ముఖ్యమంత్రి, కలెక్టర్​, తహసీల్దార్​లకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు చుట్టు పక్కల గ్రామాల్లో ఎక్కువగా జరిగినట్లు ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

పట్టా పుస్తకం ఉంటే రుణం

భూమి సాగుకు యోగ్యమైనా... కాకపోయినా నూతన పట్టాదారు పాసు పుస్తకం ఉంటే బ్యాంకులు ఒక్కో ఎకరానికి రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకూ రుణం ఇస్తాయి. దీని వల్ల గుట్టలు, అటవీ ప్రాంతంలో భూముల పట్టాలకు డిమాండ్​ పెరిగిపోయింది. రాజకీయ అండతో కొందరు అధికారులు గుట్టలు, వాగులకు సైతం పట్టా పుస్తకాలు జారీ చేస్తున్నారు.

విచారణ జరపాలి

గ్రామాల్లో పశువులకు పశుగ్రాసం అందించే వనరు గుట్టలే. వీటిని సైతం పట్టాలు చేయడం వల్ల కొందరు వాటిని చదును చేసి కబ్జా చేస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

గుట్టలకు అక్రమంగా పట్టాలిచ్చిన అధికారులు

ఇదీ చూడండి : నదిలోకి విమానం- ప్రయాణికులు సురక్షితం

ABOUT THE AUTHOR

...view details