రాజకీయ అండదండలతో అక్రమార్కులు సర్కారుకు సంబంధించిన గుట్టలను సైతం వదలడం లేదు. నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం పేర్వాల గ్రామంలోని సర్వే నెం.49లో 32 ఎకరాల విస్తీర్ణంలో రాజులగండి గుట్ట ఉంది. భూ దస్త్రాల ప్రక్షాళనలో భాగంగా అక్కడ ఓ రెవెన్యూ అధికారి తన 15 మంది అనుయూయులకు గుట్టను పట్టాలుగా చేసి అందించారు. భూమి లేని నిరుపేదలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా పట్టాలు జారీ చేయాల్సిన అధికారులు నిబంధనలు పాటించకుండా ఇతరులకు పట్టాలివ్వడం గమనార్హం.
అక్రమంగా రుణాలు
కాసులకు కక్కుర్తి పడ్డ రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా గుట్టలు, వాగులకు పట్టాలు జారీ చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. భూ దస్త్రాల నవీకరణ సమయంలో గ్రామస్థాయి సిబ్బంది ఏకమై చేతివాటం మొదలు పెట్టారు. పేర్వాల గ్రామ శివారులో సాగుకు యోగ్యం లేని మూడెకరాలు బండకు పట్టాలు జారీ చేశారు. పట్టా పాసుపుస్తకాలతో అక్రమార్కులు వివిధ బ్యాంకుల్లో లక్షల్లో పంట రుణాలు పొందారు. రైతుబంధు సొమ్మును సైతం కాజేశారనే ఆరోపణలున్నాయి.
ఇలా వెలుగులోకి..
గ్రామస్థుల ఆందోళనతో పేర్వాల గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రవీందర్రెడ్డి అక్రమంగా పట్టాలు చేసిన గుట్టలకు సంబంధించిన కీలక దస్త్రాలతో ముఖ్యమంత్రి, కలెక్టర్, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు చుట్టు పక్కల గ్రామాల్లో ఎక్కువగా జరిగినట్లు ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.