తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్కడ రాత్రికిరాత్రే అక్రమ వెంచర్లు వెలిచేస్తున్నాయి!

పురపాలక అధికారులు మున్సిపల్​ ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలవ్వడాన్ని ఆసరాగా చేసుకున్న రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తూ అక్రమాలు చేస్తున్నారు. గ్రేడ్​ వన్​స్థాయి నుంచి గ్రేడ్​ పురపాలక స్థాయికి ఎదుగుతున్న మిర్యాలగూడ పురపాలికలో అక్రమంగా ఏర్పాటు చేస్తున్న వెంచర్ల తీరు స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగితాలపై ప్లాట్ల నమూనాలు రూపొందించి విక్రయాలు చేస్తూ పురపాలిక ఆదాయానికి కోట్ల రూపాయల్లో గండి కొడుతున్నారు.

By

Published : Oct 9, 2019, 8:35 AM IST

అడ్డగోలుగా వెంచర్లు... ఆందోళనలో ప్రజలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొందరు రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరమ్మ కాలనీ, సమీపంలో చింతపల్లి, గూడూరు, గ్రామ శివారులోని పంటపొలాలు, ఈదులగూడెం ప్రాంతంలోని ఖాళీ స్థలాలు, బంగారుగడ్డ ప్రాంతంలో, అద్దంకి-నార్కెట్​పల్లి ప్రధాన రహదారి వెంట, నందిపాడు శివారులో ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఎన్నెస్పీ పిల్లకాలువ వెళ్తుండగా దాన్ని బండ రాళ్లతో పూడ్చి వేసి చదును చేశారు. అనుమతి వచ్చేంత వరకు పనులు చేసేందుకు అవకాశం లేకపోయినప్పటికీ అధికారుల కళ్లుగప్పి పనులు కానిస్తున్నారు. సమీపంలోని ప్రభుత్వ భూమిలోకి సైతం హద్దులు ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రమాదం జరిగితే... భారీ నష్టం

మరోవైపు నల్గొండ వై జంక్షన్ సమీపంలో నూతనంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడుతున్నా... కనీస అనుమతులు తీసుకోలేదు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకున్నా భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నిర్మాణాల విషయంలో పురపాలక అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కిందస్థాయిలో పర్యవేక్షణ లోపంతో యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి.

మార్కెటింగ్ చిట్కా...

రెవెన్యూ శాఖ నుంచి పంటపొలాలకు నాలా మార్పిడి మాత్రం చేయించి పురపాలికలో లే అవుట్ ఫీజు పేరుతో రూ. 10వేలు డీడీ మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ కాగితాలను చూపించి కొనుగోలు దారులను అనుమతి ఉన్న లేఅవుట్ల పేరుతో నమ్మిస్తూ అమ్మకాలు చేపడుతున్నారు. ఎవరైనా పురపాలిక కిందిస్థాయి అధికారులు తనిఖీలకు వస్తే వారికి డీడీలు చూపిస్తూ మేనేజ్ చేస్తున్నారు.

నామరూపాల్లేకుండా...

ఎన్​ఎస్పీ పిల్ల కాలువలను సైతం ఆనవాళ్లు లేకుండా చేస్తుండటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్ల కాలువలను పూర్తిగా పూడ్చి వేస్తూ వ్యాపారాలు చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత ప్రత్యేక అధికారి పురపాలక ఉన్నత అధికారులు దృష్టిసారించి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

ఒకే ఒక్క దరఖాస్తు

అద్దంకి రహదారి వెంబడి హైదరాబాద్ రోడ్డు వైపున ఉన్న ఒక వెంచర్ వారు మాత్రమే డీటీసీపీ అనుమతికి దరఖాస్తు చేశారని పట్టణ ప్రణాళిక అధికారి రమేశ్​ తెలిపారు. ఇప్పటివరకు పట్టణంలోని ఏ ప్రాంతం నుంచి దరఖాస్తు తమ వద్దకు రాలేదని స్పష్టం చేశారు. అనుమతిలేని లేఅవుట్​లో ప్లాట్లు ఎవ్వరూ కొనుగోలు చేయవద్దని, తర్వాత అక్రమ లేఅవుట్ల ఫీజు చెల్లింపు కొనుగోలుదారులపై పడుతుందని సూచించారు.

ఇదీ చూడండి : ప్లాస్టిక్ డబ్బాతో.. శునకానికి తంటాలు

ABOUT THE AUTHOR

...view details