తెలంగాణ

telangana

ఉపాధి చూపెడుతున్న సాగర్ ఉప ఎన్నిక

By

Published : Apr 8, 2021, 12:04 PM IST

కరోనా దెబ్బకు అన్ని వ్యాపారాలు కుదేలైన తరుణంలో సాగర్‌ ఉప ఎన్నిక కొన్ని వర్గాలకు ఉపాధి చూపెడుతోంది. డప్పు కళాకారులు, హోటల్స్‌, ఫంక్షన్‌హాల్స్‌ వారు ఈ ఎన్నికల పేరుతో నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు.

nagarjuna sagar by election, nagarjuna sagar by election 2021
నాగార్జునసాగర్ ఉపఎన్నిక, నాగార్జునసాగర్ ఉపఎన్నిక 2021

గతేడాది కాలంగా కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న హోటల్స్‌ నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో గత నెల రోజులుగా కిటకిటలాడుతున్నాయి. నియోజకవర్గ కేంద్రం హాలియాతో పాటు నిడమనూరు, నాగార్జునసాగర్‌ పురపాలికలోని విజయ్‌విహార్‌ హోటల్స్‌ అన్ని పార్టీల నేతలు, నాయకులతో సందడిగా కనిపిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో పాటు స్థానిక నేతలూ మధ్యాహ్నం, రాత్రి భోజనం హోటల్స్‌లోనే చేయడంతో గిరాకీ ఎక్కువగా ఉందని హాలియాలో హోటల్‌ నిర్వహిస్తున్న వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

అన్ని పార్టీల నాయకులు అక్కడే తిష్ఠ

నియోజకవర్గంలో ఉన్న ఏకైక మూడు నక్షత్రాల హోటల్‌ అయిన సాగర్‌ పురపాలికలోని విజయ్‌విహార్‌ గత నెలరోజులుగా వివిధ పార్టీల నాయకులతో కళకళలాడుతోంది. మంత్రులతో పాటు కొంత మంది ఎమ్మెల్యేలు, తెరాస, భాజపా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులంతా ఇక్కడే ఉండి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారాంతంలో తప్ప ఎప్పుడూ ఖాళీగా ఉండే హోటల్‌ పరిసరాలు కార్లతో నిత్యం రద్దీగా కన్పిస్తోంది.

మూడు గంటల ప్రచారానికి రూ.300

గ్రామాల్లో వివిధ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తుండటంతో కూలీలకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు ప్రచారంలో పాల్గొన్న వారికి రూ.300 చొప్పున ఆయా పార్టీలు చెల్లిస్తున్నాయి. సాయంత్రం మరో పూట ప్రచారానికి కూలీలు వేరే పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. వారు మూడు గంటల ప్రచారానికి మరో రూ.300 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో రోజూ కనిష్ఠంగా రూ.500 వరకు గరిష్ఠంగా రూ. 1000 వరకు సంపాదిస్తున్నారు. వీరికి రాత్రి భోజనంతో పాటు మద్యం అదనంగా దక్కుతోంది.

అద్దెకు ఫంక్షన్‌హాల్స్‌

కరోనా మహమ్మారితో పాటు పెళ్లిళ్లు లేకపోవడంతో గత నాలుగైదు నెలలుగా ఫంక్షన్‌హాల్స్‌ అన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. సాగర్‌ ఉప ఎన్నికల వేళ ఇప్పుడు అవన్నీ రద్దీగా మారాయి. కొన్ని పార్టీలైతే నెల రోజుల పాటు ఫంక్షన్‌హాల్స్‌ అద్దెకు తీసుకొని నిత్యం ప్రచారానికి వెళ్లే కార్యకర్తలు, నాయకులకు షెల్టర్‌లుగా మారాయి. కొన్ని పార్టీలు తమ కార్యకలాపాలకు, సభలకు వీటినే ఉపయోగిస్తున్నారు.

పెరిగిన మాంసం విక్రయాలు

ఓట్ల కోసం అన్ని పార్టీలు ప్రజలకు మందు, విందు భోజనాలు ఏర్పాట్లు చేస్తుండటంతో నియోజకవర్గంలోని హాలియా, సాగర్‌ పురపాలిక కేంద్రాలతో పాటు పెద్దవూర, నిడమనూరు, త్రిపురారం మండల కేంద్రాల్లో మాంసం విక్రయాలు గత కొన్ని రోజులుగా గణనీయంగా పెరిగాయి. గ్రామాల్లో ప్రచారానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి బల్క్‌గా మాంసం విక్రయాలను చేస్తున్నట్లు త్రిపురారం మండల కేంద్రానికి చెందిన చికెన్‌ దుకాణం నిర్వాహకుడు గౌస్‌ వెల్లడించారు. నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌లుగా వచ్చిన వారు గ్రామాల్లో రోజూ రాత్రి అక్కడి ఓటర్లకు మాంసంతోనే రాత్రి భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు.

డప్పు కళాకారులకు ఉపాధి

క్రమంగా కనుమరుగవుతున్న కోలాటం, డప్పు కళాకారులకు ఈ ఎన్నికలు ఉపాధినిచ్చే నీడగా మారాయి. నామినేషన్ల కార్యక్రమంతో పాటు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న పలు పార్టీలకు కోలాటం వేస్తూ కళాకారులు స్వాగతం పలుకుతున్నారు. కొన్ని చోట్ల నాట్య బృందాలు అభ్యర్థులకు మద్దతుగా పాటలతో ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details