తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2020, 12:26 PM IST

ETV Bharat / state

ఉమ్మడి నల్గొండలో మళ్లీ కరోనా కలకలం

నెలన్నరపాటు స్తబ్ధుగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాపై కరోనా మళ్లీ.. తన పంజా విసురుతోంది. వారం క్రితం వరకు ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చిన వారిలో బయటపడ్డ వైరస్.. ఇప్పుడు జిల్లా వాసుల్లోనూ వెలుగుచూస్తోంది. మూడు జిల్లాల పరిధిలో వలస కూలీలతో కలిపి ఇప్పటివరకు 140కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృత్యువాత పడ్డారు.

corona positive cases are increasing in nalgonda district again as virus is spreading
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా

గ్రీన్ జోన్​లో ఉన్న యాదాద్రి జిల్లాలో... వలస కూలీలతో అంతకంతకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. యాదాద్రితోపాటు వారం నుంచి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కొవిడ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో ఇద్దరు, నల్గొండ జిల్లాలో ఒకరు వైరస్ ​బారిన పడ్డారు.

చౌటుప్పల్​కు చెందిన వ్యాపారి... నిత్యం హైదరాబాద్ నుంచి తెచ్చిన కూరగాయల్ని మార్కెట్​లో అమ్ముతుంటాడు. మే 25న అనారోగ్యంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాడు. తగ్గకపోవడం వల్ల హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ కరోనా నిర్ధరణ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. ఆ వ్యక్తి కుటుంబానికి చెందిన నలుగుర్ని వైద్యాధికారులు పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

రాజపేట మండలానికి చెందిన మహిళ... బిడ్డను ప్రసవించి ప్రాణాలు కోల్పోయింది. ఆ పసికందు కూడా మృత్యువాత పడ్గింది. తల్లీబిడ్డల నమూనాలు పరీక్షకు పంపగా.. పాజిటివ్​గా నిర్ధరణ అయింది. అప్రమత్తమైన అధికారులు ఆమె కుటుంబానికి చెందిన 9మందిని బీబీనగర్​ ఎయిమ్స్ ఐసోలేషన్​కు తరలించారు.

నల్గొండ పట్టణానికి చెందిన యువకుడు... రెండ్రోజుల క్రితం విజయవాడ నుంచి తిరిగివచ్చాడు. ఛాతిలో నొప్పంటూ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయిస్తే హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. అక్కడ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయిస్తే పాజిటివ్​గా తేలింది. సదరు బాధితుడి కుటుంబంలో మొత్తం... ఏడుగురిని క్వారంటైన్ చేశారు. ఆ కుటుంబ సభ్యుల్లో ఆర్నెల్ల చిన్నారి, 84 సంవత్సరాల వృద్ధురాలు ఉన్నారు.

ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 85 కేసులు నమోదు కాగా... అందులో ఒక యాక్టివ్ కేసు మాత్రమే ఉంది. 83 మంది డిశ్చార్జి కాగా... నాలుగు నెలల చిన్నారి మృత్యువాత పడ్డాడు. నల్గొండ జిల్లాలో మొత్తం 16 మందికి వైరస్​ సోకగా... అందులో 15 మంది కోలుకొని ఇళ్లకు చేరారు. ఇక వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లి తిరిగి సొంత గూటికి చేరిన యాదాద్రి జిల్లా వాసుల్లో... ఇప్పటివరకు 37 మంది కరోనా బారినపడ్డారు. వీరందర్నీ హైదరాబాద్ లెక్కల్లో కలిపారు.

ABOUT THE AUTHOR

...view details