తెలంగాణ

telangana

ETV Bharat / state

బిల్లులు రాక ఆగిపోయిన మరుగుదొడ్ల నిర్మాణాలు

స్వచ్ఛ భారత్​ అన్నారు... మరుగుదొడ్లు నిర్మించుకోమన్నారు... లేకుంటే పింఛన్​ ఇవ్వమన్నారు... తీర కట్టుకున్నాక బిల్లు ఇవ్వడం లేదు. డబ్బులు రాకపోవడం వల్ల మిగిలిన వారు మరుగుదొడ్లు కట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది నాగర్​ కర్నూల్​ జిల్లాలో పురపాలకంలో విలీన గ్రామాల  పరిస్థితి. ఆగస్టు 30 లోపు మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఉరుకులు పెడుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం కనిపించడం లేదు.

By

Published : Aug 14, 2019, 9:03 PM IST

బిల్లులు రాక ఆగిపోయిన మరుగుదొడ్ల నిర్మాణాలు

నాగర్​కర్నూల్​ జిల్లా పురపాలకల్లో విలీన గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం ఒక్క అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. ఆగస్టు 2న పురపాలక సంఘాల పరిధిలో విలీనం అయిన గ్రామాలకు సంబంధించిన రికార్డులను ఎంపీడీవోలు పురపాలక సంఘాలకు అప్పజెప్పారు. పురపాలక సంఘాల పరిధిలోని గ్రామాలు తప్ప మిగతా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేశారు. ఎంపీడీవోలు, డీపీవో, డీఆర్​డీవోలు పనులపై దృష్టి పెట్టి నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు.

విలీన గ్రామాల్లో మాత్రం పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు బిల్లుల చెల్లింపులు ఏడాదిగా పెండింగ్​లో పడ్డాయి. అక్టోబర్ 2న ఓడీఎఫ్ జిల్లాగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విలీన గ్రామాల్లో బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల మిగతావారు మరుగుదొడ్లను నిర్మించుకోవడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు. నాగర్ కర్నూల్​లో ఐదు గ్రామాలు, కొల్లాపూర్​లో నాలుగు గ్రామాలు, అచ్చంపేటలో ఎనిమిది గ్రామాలు, కల్వకుర్తిలో మూడు గ్రామాలు పురపాలక సంఘాల్లో విలీనం అయ్యాయి.

ఇందులో అచ్చంపేటలో మాత్రం ఇటీవల ఎనిమిది గ్రామాలు మళ్లీ పంచాయతీగానే కొనసాగించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ... మరుగుదొడ్ల సమస్య మాత్రం అలాగే ఉంది. జిల్లాలో మూడు పురపాలక సంఘాల పరిధిలో దాదాపు 40 లక్షల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. 1,246 మరుగుదొడ్లు మంజూరు అయితే 527 మాత్రమే పూర్తి చేశారు. వాటికీ సక్రమంగా బిల్లులు చెల్లించలేదు. మిగతావి పనులు ప్రారంభించలేదు. జిల్లావ్యాప్తంగా విలీన గ్రామాల్లో మూడు వేల మరుగుదొడ్లు మంజూరు అయితే 50 శాతం పూర్తి కాలేదు. ఏడాది క్రితం మరుగుదొడ్డి నిర్మించుకున్నా బిల్లు ఇవ్వలేదని... ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు అప్పుడు అంటూ దాటేస్తున్నారని కలెక్టర్​కు కూడా ఫిర్యాదు చేశారు.

బిల్లులు రాక ఆగిపోయిన మరుగుదొడ్ల నిర్మాణాలు
జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలు 72 శాతం పూర్తయ్యాయి. 69 వేల 76 మరుగుదొడ్లు మంజూరైతే... 50 వేల ఆరు మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 18,409 మరుగుదొడ్లు వివిధ దశల్లో ఉన్నాయి. 661 ఇంకా ప్రారంభించలేదు. జిల్లాలో ఒక్క తిమ్మాజీపేట మండలంలో మాత్రం 93.21శాతం పనులు పూర్తి అయ్యాయి. ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలలో పూర్తి చేయాలని కలెక్టర్ పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఆదేశాలిచ్చారు.

బిజినేపల్లి మండలంలో 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అడ్డంకిగా మారింది. నిర్మించుకున్న మరుగుదొడ్లకు బిల్లులు రాలేదని గ్రామస్థులు చెబుతున్నారు. డబ్బులు లేక అసంపూర్తిగా వదిలేసామని వాపోతున్నారు. ఇప్పటికైనా బిల్లు చెల్లించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఎప్పుడు తీరెనో... నేతన్నల కష్టాలు


ABOUT THE AUTHOR

...view details