మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలంలోని దేవరయాంజల్ గ్రామంలో శ్రీ సీతారామస్వామి దేవాలయ భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణకు ఆదేశించింది. నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించింది. ఇదే అంశంపై ఏసీబీ, విజిలెన్స్ విచారణకు మరో ఉత్తర్వు ఇచ్చారు. వెయ్యి కోట్లకుపైనే విలువైన 1,521 ఎకరాల భూమి ఉండగా వివిధ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాల ఆధారంగా.. దర్యాప్తునకు ఆదేశించింది. పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు నేతృత్వంలో ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని వేసింది. ఈ కమిటీలో నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళి కేరి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మహంతిలను సభ్యులుగా నియమించింది. ఆక్రమణకు గురైన భూ వివరాల సేకరణ, కబ్జాకు గురైన తీరు తెలుసుకోవటం ప్రస్తుతం భూమి ఉపయోగిస్తున్న విధానం, ధ్రువపత్రాల సేకరణ, ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూముల విస్తీర్ణం, దేవాలయానికి జరుగుతోన్న నష్టంపై దర్యాప్తు చేయాలని.. కమిటీని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐఏఎస్ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించింది.
రెండు రోజుల్లో నివేదిక
ఈటల రాజేందర్ భూ కబ్జాల అంశంపై సోమవారం మూడోరోజూ ఏసీబీ, విజిలెన్స్ విచారణ కొనసాగింది. మాసాయిపేట మండలం అచ్చంపేట వద్ద జమున హేచరీస్లో కట్టడాలకు సంబంధించిన అనుమతులపైనే అధికారులు ఎక్కువ దృష్టి పెట్టారు. అచ్చంపేట, హకీంపేట పంచాయతీ కార్యదర్శులను విచారించారు. రికార్డులు తనిఖీ చేశారు. జమునా హేచరీస్ భూముల వ్యవహారమై ఈ సంస్థ పేరిట కెనరా బ్యాంకులో తీసుకున్న రుణ సమాచారం సేకరించారు. 55 ఎకరాల పట్టా భూమి దస్త్రాలు బ్యాంకులో పెట్టి 93 కోట్ల రుణం తీసుకున్నట్లు గుర్తించారు. దేవరయాంజాల్లోని మరో 44 ఎకరాలు చూపినట్లు తేల్చారు. ఇవన్నీ పట్టా భూములేనని బ్యాంకు అధికారులకు చెప్పినట్లు సమాచారం. విజిలెన్స్ విభాగం ఈ వ్యవహారాలన్నింటిపైనా రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనుంది.