రైతు సగర్వంగా తలఎత్తుకొని బతికేలా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా అప్పాయిపల్లి వద్ద పత్తి కొనుగోలు కేంద్రాన్ని, కోటకదిరలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తున్నామన్నారు.
ప్రభుత్వమే కొంటుంది...
గతంలో చెల్లింపుల్లో జాప్యం, దళారుల బెడద ఉండేదని, వడ్డీ వ్యాపారులు రైతుల కల్లాలల్లోనే ధాన్యాన్ని అప్పు కిందకు తీసుకెళ్లేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వమే నేరుగా ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యంతో పాటు, మొక్కజొన్న, పత్తి వంటివి కొంటోందని తెలిపారు. ముఖ్యమంత్రి మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తామని చెప్పారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మహబూబ్నగర్ మండలంలో గోదామును నిర్మిస్తామని, కొత్త మార్కెట్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.