కరీంనగర్ నగరంలో ఫంక్షన్హాల్స్ యజమానులకు కోతులతో పెద్ద తలనొప్పిగా మారింది. ఇళ్ల వద్ద ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటుండటంతో వేడుక వేదికలను అడ్డాగా మార్చుకుంటున్నాయి. ఒకేసారి 30 నుంచి 40 దూసుకొస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అడవులు తగ్గడం, పండ్లు, ఫలాలు దొరికే పరిస్థితి లేకపోవడంతో నగరంలోకి దండు కడుతున్నాయి.
అంతటితో ఆగకుండా..
రాత్రిపూట వచ్చి ఫంక్షన్హాల్స్లో మకాం వేస్తున్నాయి. అంతటితో వాటి ఆగడాలు ఆగడం లేదు. వంట చేయనీయకుండా అడ్డుపడుతున్నాయి. భోజనం చేయకుండా ప్లేట్లు ఎత్తుకెళ్తున్నాయి. జనం పట్ల నానా రభస చేస్తున్నాయి. దీనితో కోతుల బెడదను తట్టుకోలేక యజమానులు కొండెంగలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దాడిచేస్తూ..
కలెక్టరేట్ ప్రాంతంలో చెట్లు అధికంగా ఉండటంతో కోతులు ఎక్కువగా అక్కడే కన్పిస్తున్నాయి. ఎవరైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఆటంకం సృష్టిస్తున్నాయి. వంట సామగ్రి, కూరగాయలు ఎత్తుకెళ్తున్నాయి. జనాలపై దాడిచేసి గాయపరుస్తున్నాయి. వంట చేసేవారిని బయపెడుతుండటంతో యజమానులు ప్రత్యమ్నాయంగా కొండెంగలపై దృష్టి పెట్టారు.