తెలంగాణ

telangana

ETV Bharat / state

జూన్​లోనే చెరువులకు కాళేశ్వరం నీళ్లు

కేసీఆర్ మహా సంకల్పం పూర్తికావొచ్చింది. ఉత్తర తెలంగాణను అన్నపూర్ణగా మలిచే మహోన్నత స్వప్నం ఫలించేందుకు ఇంకా కొద్దినెలలే మిగిలింది. ఖరీఫ్ నాటికి కాళేశ్వరం జలాలతో సాగు చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగుతోంది. ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను మధ్యమానేరుకు ఎత్తిపోసి అక్కడి నుంచి దిగువకు తరలించడంతో పాటు చెరువులను నింపే దిశగా రంగం సిద్ధమైంది.

By

Published : Apr 20, 2019, 12:46 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఉపయోగాలు

రాష్ట్రంలో 18 లక్షలకు పైగా ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు, మరో 18 లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఫలాలను ఈ వర్షాకాలమే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. పనులు అన్నీ పూర్తి కాకపోయినప్పటికీ వీలైనంత మేర గోదావరి జలాలను ఎత్తి పోసి దిగువకు తరలించడం, చెరువులు నింపే లక్ష్యంగా సర్కార్ ముందుకు సాగుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఉపయోగాలు


వెట్​రన్​తో కొత్త ఉత్సాహం


ప్రాజెక్టు రెండో లింక్​లోని ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నుంచి మధ్యమానేరు వరకు పనులు దాదాపుగా పూర్తైన నేపథ్యంలో గోదావరి జలాలను మొదట దిగువకు తరలించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆరు, ఎనిమిది ప్యాకేజీల్లో పంపులు సిద్ధమయ్యాయి. సర్జ్ పూళ్ల నిర్మాణం కూడా పూర్తైనందున... వర్షాకాలంలో నీరు ఎత్తిపోసేందుకు వీలుగా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఆరో ప్యాకేజీలోని పంపులకు గతంలో డ్రైరన్ నిర్వహించిన ఇంజినీర్లు... ఇటీవలే వెట్ రన్ కూడా నిర్వహించనున్నారు. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నుంచి ఇప్పటికే ఆరో ప్యాకేజీలోని సర్జ్ పూల్​కు నీరు విడుదల చేశారు. ఈనెల 22 వరకు సర్జ్ పూల్ పూర్తిగా నిండుతుందని అంచనా వేస్తున్న ఇంజినీర్లు... 124.4మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు పంపులతో... 24న వెట్ రన్​కు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే అధిగమించి పూర్తి స్థాయి నీటి ఎత్తిపోతకు సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ఏడో ప్యాకేజీ ద్వారా ఎనిమిదో ప్యాకేజీ సర్జ్ పూల్​కు నీరు తరలించి అక్కడ కూడా పంపుల వెట్ రన్ చేపడతారు.


సవాల్​గా నిలిచిన ఏడో ప్యాకేజీ కూడా పూర్తి...!


ఏడో ప్యాకేజీ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సొరంగాలు కుంగిపోయి సంక్లిష్టమై సవాల్ విసిరిన ఏడో ప్యాకేజీ సొరంగం పనులను అతి కష్టం మీద పూర్తి చేశారు. ఇక్కడి జంటసొరంగాల్లో మరో 800 మీటర్ల మేర సిమెంట్ లైనింగ్ పనులు మిగిలి ఉన్నాయి. అవి కూడా నెలాఖరు వరకు పూర్తవుతాయని అంచనా. ఆ తర్వాత ఎనిమిదో ప్యాకేజీలోని పంపుల వెట్ రన్ చేపడతారు. అక్కడ 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ పంపులు సిద్ధంగా ఉన్నాయి.


ఎస్సారెస్పీకి కడెం జలాలు


ఈ ప్రక్రియ పూర్తైతే ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నుంచి గోదావరి జలాలను మధ్యమానేరుకు, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి ఎత్తిపోయవచ్చు. వర్షాకాలంలో వీలైనంత మేరకు ఎల్లంపల్లి నుంచే నీరు ఎత్తిపోయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్లంపల్లి ఎగువన ఉన్న కడెం జలాశయానికి ఏటా భారీగా వరద వస్తుంది. దాదాపుగా వంద టీఎంసీల వరకు నీరు కడెం నుంచి దిగువకు వెళ్తుంది. ఈ నీటిని ఉపయోగించుకోవాలని భావిస్తోన్న ప్రభుత్వం... ఎల్లంపల్లి ద్వారా జలాలను ఎత్తిపోసి మధ్యమానేరు, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ఎస్సారెస్పీకి తరలించేందుకు సిద్ధమవుతోంది. అక్కణ్నుంచి వీలైనంత దిగువకు నీరు ఇవ్వడంతో పాటు చెరువులు నింపేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.


పూర్తికావొచ్చిన అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ


కీలకమైన మేడిగడ్డ ఆనకట్ట పనులు మాత్రం ఇంకా కొంత మేర మిగిలే ఉన్నాయి. మే నెలాఖరు వరకు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు, పంప్ హౌజ్​ పూర్తి స్థాయిలో సిద్ధమవుతాయని ఇంజినీర్లు చెప్తున్నారు. వర్షాకాలంలో ఈ మూడు ఆనకట్టల వద్ద నీటిని నిల్వ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయగా మిగిలిన జలాలను అన్నారం, సుందిళ్ల జలాశయాల్లో నిల్వ చేస్తారు. అటు ప్రాణహిత నుంచి వచ్చే జలాలను మేడిగడ్డ వద్ద నిల్వ చేయనున్నారు.

కాళేశ్వరం ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీరు తరలింపుపై సర్కార్ దృష్టి సారించింది. మొదటి దశలో 1.9 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఎలక్ట్రో మెకానికల్ పనులు చేపట్టారు. సివిల్ పనులు మాత్రం మూడు టీఎంసీల సామర్థ్యానికి తగ్గట్లు చేశారు.

కొత్తగా మార్పులు సూచించిన కేసీఆర్


తాజాగా మూడు టీఎంసీలు ఎత్తిపోసేలా అదనపు పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు మరో 1.1 టీఎంసీల నీరు తరలించేందుకు అదనపు సొరంగాలు, సర్జ్ పూల్​తో పాటు అదనపు జలాశయం అవసరం. పత్తిపాక వద్ద ఎనిమిదిన్నర టీఎంసీల జలాశయాన్ని ఇంజినీర్లు ప్రతిపాదించగా... సామర్థ్యం ఎక్కువగా ఉండాలని సీఎం తెలిపారు. ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాకుండా 25 టీఎంసీల సామర్థ్యంతో పత్తిపాక వద్ద జలాశయం నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తుదిదశలో ఉన్నాయి.


మరో రూ.20వేల కోట్లు పెరగనున్న వ్యయం


మధ్యమానేరు నుంచి దిగువకు అదనపు జలాలను తరలించేందుకు చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు పూర్తయ్యాయి. పదివేల కోట్లకు పైగా వ్యయమయ్యే ఈ పనులకు త్వరలోనే సీఎం ఆమోదం లభించే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా మూడు టీఎంసీల నీటిని తరలించేందుకు చేపట్టే అదనపు పనుల కోసం మరో 20వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం లక్ష కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం చేపట్టిన పనులను పూర్తి చేసి... ఆ తర్వాత అదనపు పనులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details