Constable Kistaiah Daughter Becomes A Doctor : తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న వారిలో కానిస్టేబుల్ కిష్టయ్య ఒకరు. కానీ ఆ సంఘటనతో ఆయన కుటుంబం రోడ్డున పడింది. తండ్రి కల సాకారం చేయడానికి కిష్టయ్య కుమార్తె ప్రియాంక మాత్రం తన పట్టుదలను కొనసాగించింది. ఆమె సంకల్పానికి సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం తోడవడంతో చదువుల్లో ప్రతిభ చూపి వైద్య విద్యను పూర్తి చేసుకుంది. బస్తీ దవాఖానాకు వైద్యాధికారిగా విధులు చేపట్టింది ఈ యువతి.
KCR Helps Constable Kistaiah Daughter : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను ప్రాణ త్యాగం చేస్తానంటూ సెల్ టవర్ ఎక్కిన కానిస్టేబుల్ కిష్టయ్యకు ఎవరెంత చెప్పినా టవర్ దిగిరాలేదు. ఎవరైనా దింపే ప్రయత్నం చేస్తే కాల్చేస్తానని హెచ్చరించాడు. భార్యాపిల్లలు వేడుకున్నా ఫలితంలేదు. తెలంగాణ కంటే తనకు కుటుంబం ముఖ్యం కాదని కరాఖండిగా చెప్పి రివాల్వర్తో కాల్చుకుని అమరుడయ్యాడు. అతడి మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదయింది.
కేసీఆర్ భరోసా..తండ్రి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ప్రియాంక 7వ తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందుండే తనను... డాక్టర్ కావాలని, పేదలకు నీ సేవలు అందించాలని...తన తండ్రి ఎప్పుడు ప్రేరేపించేవాడని చెబుతోంది ఈ యువతి. కిష్టయ్య ఆత్మహత్య చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం కరీంనగర్కు వలస వచ్చింది. పిల్లల్ని ఎలా చదివించాలో తెలియక కిష్టయ్య భార్య పద్మ ఎన్నోకష్టాలు ఎదుర్కొన్నారు. అయితే అప్పటి ఉద్యమనేత ఇప్పటి సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. అవసరమైనవన్నీ సమకూర్చడంతోపాటు కిష్టయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు. అలా ఆ కుటుంబం నిలదొక్కుకుంది.