తెలంగాణ

telangana

ETV Bharat / state

సమస్యల ఛట్రంలో అన్నదాత... ఆదుకునే వారే లేరు

సమస్యల ఛట్రంలో అన్నదాత నలుగుతుంటే సాంత్వన కలిగించేవారే కరవవడం విడ్డూరం.. ఓ వైపు ప్రభుత్వం అన్నదాతను అన్ని విధాలా ఆదుకోవాలని స్పష్టం చేస్తుంటే అధికార యంత్రాంగం మాత్రం అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది. ఖరీఫ్‌ ప్రారంభమై నెలన్నర గడిచినా బ్యాంకులు రుణాలిచ్చేందుకు సాకులు వెతుకుతుండగా రైతుబంధు సాయమందక వేలమంది రైతులు పడిగాపులు కాస్తున్నారు. పంట పండించిన రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించగా కాసుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి.. ఆశించినస్థాయిలో వర్షాలు లేకపోగా వేసిన పంటల పరిస్థితి ఏమిటన్నది కాలమే తేల్చనుంది.

By

Published : Jul 13, 2019, 12:13 PM IST

farmers problem to cultivate crops as there is lack of water in karimnagar district

రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.5వేలు పెట్టుబడి సాయం అందిస్తుండగా కార్యచరణ లేమితో కర్షకులకు చేరడంలేదు. జిల్లాలో రూ.171 కోట్లు రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉండగా చేరింది మాత్రం రూ.100 కోట్లు మాత్రమే. 98 వేల మందికి మాత్రమే నగదు చేరగా 63 వేల మందికి నగదు రాకపోగా ఏటీయంలను తరచిచూస్తున్నారు. కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, గంగాధర, మానకొండూర్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి మండలాల్లో వేలసంఖ్యలో రైతులకు సాయం చేరకపోవడం వల్ల వ్యవసాయ అధికారులను ఆశ్రయిస్తున్నారు.

వర్షాల లేమి.. అంతటా లోటే

ఎన్నడూ లేనివిధంగా ఈ ఖరీఫ్‌ సీజన్‌ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జూన్‌లో వానలు అంతంతమాత్రమే కాగా ఈ నెలలో 12 రోజులు గడువగా చిన్న కుంట కూడా నిండింది లేదు. నార్లు పోసిన రైతన్న నాట్లు వేసేందుకు నీరు లేక వర్షమో రామచంద్రా.. అంటూ అర్రులు చాస్తున్నారు. ప్రాజెక్టుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అడపదడపా కురుస్తున్న వర్షం పత్తి, మొక్కజొన్న పంటలకు కొంతలో కొంత ఉపశమనం కలిగిస్తుండగా చెరువు నిండింది లేదు.. నీటి గోస తీరింది లేదు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 40శాతమే పంటలు సాగవడం వర్షలేమిని చాటుతోంది. రామడుగు, కరీంనగర్‌ రూరల్‌, మానకొండూర్‌, తిమ్మాపూర్‌, శంకరపట్నం, వీణవంక, హుజూరాబాద్‌, జమ్మికుంట మండలాల్లో ఇంకా లోటు వర్షపాతమే.

తేలని రుణమాఫీ.. అందని రుణం

రుణమాఫీ చేయాలని నిర్దేశించిన ప్రభుత్వం ఆచరణలో అడుగు వేయకపోవడం వల్ల కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా రూ.500 కోట్ల వరకు రుణమాఫీ కావాల్సి ఉండగా ఎటూ తేలడం లేదు. వార్షిక రుణ ప్రణాళిక ఇటీవల ఖరారు కాగా కొత్త రైతులకు రుణాలివ్వడం లేదు. మొన్నటివరకు రుణ ప్రణాళిక ఖరారు కాలేదని సాకులు చెప్పి ఇప్పుడు ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభమయ్యాక.. అంటూ దాటవేస్తున్నారు.

ధాన్యం డబ్బులు ఏవీ ?

పంటను విక్రయించి 48 గంటల్లోనే రైతుల ఖాతాకు నగదు చేరాలని ప్రభుత్వం స్పష్టం చేయగా ఆచరణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం నగదు చేతిలో ఉంటేనే అరక సాగుతుంది. కూలీలకు చెల్లింపులు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్నింటికి డబ్బులు చెల్లిస్తేనే పని సాగుతుంది. అయితే ఇప్పటివరకు ఇతర మార్గాల ద్వారా రుణాలిచ్చిన బ్యాంకర్లు రైతులకు మాత్రం ఇవ్వడం లేదు. గ్రామాలు, పట్టణాల్లో వడ్డీ వ్యాపారులను కలిస్తే నూటికి రూ.3 నుంచి రూ.5 వరకు వసూలు చేస్తున్నారు. పంట చేతికొచ్చే వరకు వడ్డీ తడిసిమోపెడయ్యే అవకాశం ఉంది.

విత్తనాల లేమి.. కల్తీ జోరు

పత్తి విత్తనాలకు సంబంధించి పూర్తిగా ప్రైవేట్‌ కంపెనీలే ఆధారం కాగా మొక్కజొన్న, వరి, కంది వంటి వాటిని తక్కువ మొత్తంలో పరిశోధన స్థానాలు అందిస్తున్నాయి. ప్రైవేట్‌ను నమ్ముకుంటే కల్తీ విత్తనాల విక్రయాలు జోరందుకున్నాయి. జిల్లాలో హుజూరాబాద్‌, కరీంనగర్‌, శంకరపట్నం మండలాల్లో రూ.కోట్లు విలువైన కల్తీ విత్తనాల పట్టుబడగా నియంత్రణ పూజ్యం. ఏటా అక్రమార్కులు కొత్తదారులు వెతుకుతుండగా మూకుతాడు వేసేవారే కరవయ్యారు. ఏటా రూ.100 కోట్ల వ్యాపారం కల్తీ విత్తనాలదే..

పత్తి బీమా చేసింది 100 మందే..

రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకులే పంటల బీమా ప్రీమియం మినహాయిస్తుండగా రుణం తీసుకోనివారు చేతి నుంచి కట్టాల్సిందే.. ఈ విషయంలో వ్యవసాయ శాఖ అవగాహన కల్పించడంలో విఫలమైందని స్పష్టమవుతోంది. అధికారుల వద్ద సమాచారం ప్రకారం ఇప్పటివరకు 100 మంది మాత్రమే పత్తి పంటకు బీమా చేశారు. బ్యాంకు రుణం తీసుకున్న రైతుల్లో 15 వేల మంది బీమా మినహాయించారు. జిల్లా వ్యాప్తంగా 46,500 హెక్టార్లలో వివిధ పంటలు సాగవగా 35 వేల హెక్టార్లలో పత్తి సాగైంది. 8,500 హెక్టార్లలో మొక్కజొన్న, 3 వేల హెక్టార్లలో వరి సాగైంది.

For All Latest Updates

TAGGED:

jagityal

ABOUT THE AUTHOR

...view details