తెలంగాణ

telangana

By

Published : Jun 8, 2022, 8:55 PM IST

Updated : Jun 9, 2022, 3:02 AM IST

ETV Bharat / state

TSRTC Charges: మరోసారి ఆర్టీసీ ఛార్జీల బాదుడు.. నేటి నుంచే అమలు

TSRTC
ఆర్టీసీ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం

20:53 June 08

Tsrtc charges: కిలోమీటర్‌ వారీగా డీజిల్ సెస్ విధింపునకు రంగం సిద్ధం

TSRTC Charges: తెలంగాణ ఆర్టీసీ డీజిల్‌ సెస్సు పేరుతో మరోదఫా ప్రయాణికులపై భారీ భారాన్ని మోపింది. కిలోమీటరు ప్రాతిపదికన పల్లెవెలుగు నుంచి ఏసీ సర్వీసుల వరకు అన్నింటిపైనా ఛార్జీలను పెంచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రయాణికులను మాత్రం ఈ పెంపు నుంచి మినహాయించింది. తాజా పెంపు గురువారం తొలి సర్వీసు నుంచి అమలులోకి వస్తుంది. ఈ ఏడాది మార్చిలో డీజిల్‌ సెస్సు పేరుతో గంప గుత్తగా ప్రతి ప్రయాణికుడిపై రూ. రెండు నుంచి రూ. అయిదు పెంచింది. తాజాగా కిలోమీటరు వారీగా డీజిల్‌ సెస్సును వడ్డించింది. విద్యార్థుల బస్సు పాసు ఛార్జీలను కూడా త్వరలో పెంచాలని నిర్ణయించింది. మార్చిలో డీజిల్‌, సౌకర్యాల సెస్సుల నుంచి టోల్‌ట్యాక్స్‌ వ్యత్యాసం, దగ్గరి రూపాయికి ఛార్జీల సవరణ పేరుతో భారీగా వడ్డించింది. ఆ పెంపుతో ప్రయాణికులపై సగటున 20 రూపాయల వరకు భారం పడిందని అంచనా. తాజా పెంపు దానికి అదనం. గురువారం నాటి ప్రయాణాలకు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు అదనపు ఛార్జీలను చెల్లించాలి. డీజిల్‌ ధరల పెరుగుదలతో ఆర్టీసీపై భారం పడడమే అదనపు సెస్సుకు కారణమని సంస్థ చెబుతోంది.

నష్టాన్ని భరించలేకే..
డీజిల్‌ భారం భరించలేకే మరో దఫా సెస్సును పెంచాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రస్తుతం రోజుకు ఆరు లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నాం. దీనివల్ల ప్రస్తుతం రోజుకు రూ. అయిదు కోట్ల నష్టం వస్తోంది. త్వరలో విద్యార్థుల బస్‌పాస్‌ ఛార్జీలను కూడా పెంచుతాం. 2019 తరువాత ఆ విభాగంలో ఛార్జీలు పెంచలేదు. పాసుల గడువు ముగిసేవరకు పాత విధానమే అమలులో ఉంటుంది’ అని వారు తెలిపారు.

ఛార్జీల భారం ఇలా..
తాజాగా విధించిన సెస్సుతో కిలోమీటర్లు పెరిగే కొద్దీ ఛార్జీలు పెరుగుతాయి. దూరప్రాంతాలకు వెళ్లే వారిపై అధికభారం పడనుంది. కనీస సెస్సును పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ. అయిదు చొప్పున, సూపర్‌లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ. పదిగా నిర్ణయించింది.

  • పల్లెవెలుగు సర్వీసులో 250 కిలోమీటర్లకు కనిష్ఠంగా రూ. 5 నుంచి గరిష్ఠంగా రూ. 45 వరకు పెరిగింది.
  • ఎక్స్‌ప్రెస్‌ బస్సులో 500 కి.మీ. వరకు కనిష్ఠంగా రూ.5 నుంచి రూ. 90 పెరిగింది.
  • సూపర్‌ లగ్జరీ సర్వీసులో 500 కి.మీ. దూరానికి కనిష్ఠంగా రూ. 10 నుంచి గరిష్ఠంగా రూ. 130 పెంచారు.
  • ఏసీ సర్వీసులన్నింటిలో 500 కిలోమీటర్ల వరకు రూ. 10 నుంచి రూ. 170 వరకు పెంచారు.

ఏ బస్సుల్లో ఎంతెంత?

  • 147 కిలోమీటర్ల హైదరాబాద్‌ - వరంగల్‌ మార్గంలో ఎక్స్‌ప్రెస్‌లో రూ. 25, డీలక్స్‌లో రూ. 30, సూపర్‌ లగ్జరీలో రూ. 30, రాజధాని బస్సులో రూ. 40 పెరుగుతుంది.
  • 163 కి.మీ. హైదరాబాద్‌ - కరీంనగర్‌కు ఎక్స్‌ప్రెస్‌ రూ. 30, డీలక్స్‌ రూ. 35, సూపర్‌ లగ్జరీ రూ. 40, రాజధానిలో రూ.50 భారం పెరుగుతుంది.
  • 254 కి.మీ. హైదరాబాద్‌ - విజయవాడకు ఎక్స్‌ప్రెస్‌లో రూ. 45, డీలక్స్‌ రూ. 50, సూపర్‌లగ్జరీ రూ. 60, రాజధాని రూ. 70 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
  • 575 కి.మీ. హైదరాబాద్‌ - బెంగళూరుకు సూపర్‌ లగ్జరీ బస్సులో రూ. 145, రాజధాని బస్సులో రూ. 190 అదనంగా చెల్లించాలి.

ఇవీ చదవండి:రైతుల ఆదాయం పెరిగేలా మద్దతు ధరలు: బండి సంజయ్

పట్టపగలే నగల షాప్​లో చోరీకి యత్నం.. ఎదురించిన యజమాని.. వీడియో వైరల్​

Last Updated : Jun 9, 2022, 3:02 AM IST

ABOUT THE AUTHOR

...view details